బాలికపై లైంగిక దాడి కేసులో ఇరవై ఏళ్ల జైలు శిక్ష

23 Jul, 2021 02:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రూ.50 వేల జరిమానా 

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుతో బాధితులకు సత్వర న్యాయం

చిత్తూరు అర్బన్‌: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. ఇలాంటి ఘటనల్లో కేసులను సత్వరమే విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్‌ న్యాయస్థానంతో బాధితులకు సత్వర న్యాయం లభించింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన బి.గంగాధర్‌కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ చిత్తూరులోని ‘పోక్సో’ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ప్రత్యేక అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లీలావతి కేసు వివరాలు వెల్లడించారు.

2018 జనవరి 13న మదనపల్లెలో.. రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో అప్పటి మదనపల్లె టూటౌన్‌ సీఐ నరసింహులు కేసు దర్యాప్తు చేసి మదనపల్లె పట్టణం గొల్లపల్లెకు చెందిన గంగాధర్‌ను అరెస్టు చేసి అదే నెల 17న కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణలో పోలీసులు సరైన సాక్ష్యాలు చూపడంతో గంగాధర్‌కు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి యు.ప్రసాద్‌ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లిస్తే ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి ఇవ్వాలని, చెల్లించకుంటే అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు