స్నేహలత హత్య కేసును చేధించిన పోలీసులు

24 Dec, 2020 19:58 IST|Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఎస్‌బీఐలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని స్నేహలత (19) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు  ఎదుర్కొంటున్న ప్రియుడు గుత్తి రాజేష్‌, కార్తీక్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరిపై ఐపీసీ సెక్షన్‌ 302,201 కింద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ బి.సత్యయేసు గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. నిందితులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్లు  చెప్పారు. ఈ సందర్భంగా  ఎస్పీ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గత నాలుగేళ్లుగా స్నేహలత-రాజేశ్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. ఇతర వ్యక్తులతో సంబంధాలున్నాయని రాజేశ్‌ వేధించాడని, ఈ క్రమంలో రాజేష్‌ మంగళవారం స్నేహలతను తన బైక్‌ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పారు. (యువతి దారుణ హత్య)

బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్‌ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడయాని అనంతరం తల్లిదండ్రులు ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.  నిందితులపై త్వరగా ఛార్జ్‌షీట్‌ వేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కాగా స్నేహలత హత్య కేసు స్థానికలంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్థానిక ఎస్పీ పర్యవేక్షణలో కేసు విచారణ జరిగింది. దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. (స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు)

మరిన్ని వార్తలు