చిన్నారులకు నరకం చూపించిన దుండగులు

20 Nov, 2020 12:05 IST|Sakshi
నిందితులు

స్టాక్‌హోమ్‌ : జాలి, దయ అనేవి అణువంత కూడా లేకుండా ఇద్దరు మగ పిల్లలపై అతి దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు దుండగులు.  వారిని కిడ్నాప్‌చేసి, విచక్షణా రహితంగా కొట్టి, అత్యాచారం జరిపి, సజీవంగా పాతిపెట్టారు. చివరకు దుండగుల నుంచి తప్పించుకున్న పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. గత ఆగస్టు నెలలో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఫొటోలను పోలీసులు గురువారం విడుదల చేశారు. అయితే నిందితుల పేర్లను మాత్రం తెలుపలేదు.

చిన్నారులను పాతి పెట్టిన గొయ్యి

కేసుకు సంబంధించిన వివరాలు... 
ఆగస్టు 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు మగ పిల్లలు శ్మశానానికి దగ్గరలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఇద్దరు వ్యక్తులు వారిని సమీపించి డ్రగ్స్‌ కొంటారా అని అడిగారు. ఇ‍ద్దరు పిల్లలు వద్దని చెప్పి, అక్కడినుంచి ముందుకు సాగారు. అయితే వారిని వెంబడించిన దుండగులు కత్తితో బెదిరించి అక్కడికి దగ్గరలోని అడవిలోకి లాక్కెళ్లారు. చిన్నారుల కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకుని, ఎదురు తిరిగితే వారిని చంపుతామంటూ బెదిరించారు. విచక్షణా రహితంగా కొట్టి, శ్మశానంలోకి తీసుకెళ్లారు. అక్కడ వారి బట్టలు విప్పించారు. సెల్‌ఫోన్‌లు లాక్కొని దూరంగా పడేశారు.

 సంఘటనా స్థలం వద్ద చిన్నారుల దుస్తులు

చివరకు వారి గొయ్యిని వారే తవ్వుకునేలా చేశారు. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఇద్దర్నీ గొయ్యిలో పాతిపెట్టారు. దుండగులు పక్కకు వెళ్లిపోయిన సమయంలో చిన్నారులు గొయ్యిలోనుంచి బయటపడి, అక్కడినుంచి తప్పించుకున్నారు. బట్టలు లేకుండా రోడ్లపై పరిగెత్తసాగారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారులు అందించిన వివరాలతో నిందితుల్ని త్వరగానే అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు