రూటు మార్చిన దొంగలు: పల్లెలు టార్గెట్‌గా..

24 Oct, 2020 19:21 IST|Sakshi

సాక్షి, కృష్ణా : మెడలో గొలుసులు తెంచుకుపోయే దొంగలు తమ రూటు మార్చుకున్నారు. నిన్నటి వరకు పట్టణాల్లో, నగరాల్లోనే ఇటువంటి దొంగతనాలు చేసేవారు. ప్రస్తుతం గ్రామాలను టార్గెట్‌ చేసుకున్నారు. శుక్రవారం పామర్రు మండలంలో రెండు చోట్ల చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు జరిగాయి. పామర్రులో ఉదయం 7 గంటల సమయంలో సుబ్బరత్తమ్మ వైష్ణవాలయం ముందు ఉన్న తన ఇంటి నుంచి కిరాణా షాపునకు వెళ్తుండగా దుండగులు బైక్‌పై వచ్చి బండిని ఆమె పక్కగా పోనిచ్చారు. ఇది గమనించిన ఆమె పక్కకు జరిగింది.  ఆ గుర్తు తెలియని ఆగంతకులు వెనుక నుండి వచ్చి ఆమె ముందుగా బండి తిప్పి మెడలో ఉన్న నానుతాడు లాక్కెళ్లడానికి యత్నించారు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించటంతో బలంగా గొంతునొక్కారు. ( ట్రాఫిక్‌ పోలీస్ చొక్కా పట్టుకుని..)

ఇది గమనించిన మరో మహిళ గట్టిగా కేకలు వేయటంతో దుండగులు పారిపోయారు. ఈ సంఘటన నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరగటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని జమీగొల్వేపల్లిలో మహిళ మెడలోని రెండున్నర కాసుల బంగారు నానుతాడును దొంగలు తెంపుకుపోయారు. జమీగొల్వేపల్లి గ్రామానికి చెందిన నాగమణి ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లోని చెత్తను బయట పారబోసి వస్తుండగా దొంగలు ఆమె మెడలోని గొలుసును లాక్కొని పారిపోయారు. పామర్రులో జరిగిన దొంగతన యత్నం, జమీగొల్వేపల్లి లో జరిగిన దొంగతనం ఒకే మాదిరిగా ఉండటంతో ఈ రెండు ఒకరే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు