Road Accident: అతి వేగం.. ఆపై నిద్రమత్తు.. రెండు నిండు ప్రాణాలు గాల్లోకి..

29 Sep, 2021 07:01 IST|Sakshi

సాక్షి,శామీర్‌పేట్‌(హైదరాబాద్‌):  అతి వేగం.. ఆపై నిద్రమత్తు కారణంగా రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా స్తంభపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్‌(34), బంధువు రాజేందర్‌(27), మరో వ్యక్తి వంశీ కలిసి కారులో సుదర్శన్‌ తండ్రి అనంతయ్యను దుబాయ్‌ పంపించేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వెళ్లారు.
► అనంతరం హైదరాబాద్‌ – కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి రోడ్డు మీదుగా తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో శామీర్‌పేట మండల పరిధిలోని లారీ బైలేన్‌ వద్దకు రాగానే పార్కింగ్‌లో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీ కొట్టారు. కారులో ముందు భాగంలో కూర్చున్న సుదర్శన్, రాజేందర్‌ ఘటన స్థలంలోనే మృతి చెందగా వంశీకి గాయాలయ్యాయి.  
► సమాచారం అందుకున్న శామీర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మేడ్చల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవింగ్‌ చేస్తున్న రాజేందర్‌ రెస్ట్‌ లేకుండా కారు నడపడంతోనే నిద్ర మత్తులో కంటైనర్‌ను ఢీకొట్టి ఉంటాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధీర్‌కుమార్‌ తెలిపారు.

చదవండి: విడాకులు ఇవ్వట్లేదని.. ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్‌

మరిన్ని వార్తలు