అదృశ్యమై ఉరికి వేలాడిన ఇద్దరు.. వివాహేతర సంబంధమే కారణమా?

3 Sep, 2021 02:38 IST|Sakshi
ధర్మయ్య (ఫైల్‌)  కృష్ణవేణి (ఫైల్‌) బాలయ్య (ఫైల్‌) 

లంకపల్లిలో ఇద్దరి అనుమానాస్పద మృతి 

ఆత్మహత్య చేసుకున్నారా.. హత్య జరిగిందా? 

వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు 

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలు వెలుగు చూశాయి. గ్రామానికి చెందిన మేకతొట్టి వజ్రమ్మ పాతబడిపోయిన తన ఇంటికి తాళం వేసి కొంతకాలంగా అదే గ్రామంలోని కూతురు ఇంట్లో ఉంటోంది. గురువారం ఉదయం ఆమె ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లే సరికి ఒక పురుషుడు, ఓ మహిళ మృత దేహాలు దూలానికి వేలాడుతూ కనిపించడంతో భయాందోళనతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది.

మృతదేహాలు కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నాయి. స్థానికులు పరిశీలించి తమ గ్రామానికే చెందిన పచ్చినీళ్ల ధర్మయ్య (32), ఇంజిమళ్ల కృష్ణవేణి (25)గా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి రూరల్‌ సీఐ టి.కరుణాకర్, వీ.ఎం.బంజర్‌ ఎస్సై తోట నాగరాజు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

అసలేం జరిగి ఉంటుంది.. 
లంకపల్లికి చెందిన ధర్మయ్య, కృష్ణవేణి గ త నెల 26 నుంచి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి భర్త బాలయ్య (30) అదేరోజు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. కృష్ణవేణి, ధర్మయ్య మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆ అవమానంతోనే బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ప్ర చారం జరుగుతోంది. కాగా, బుధవారం నుంచే ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నా, చుట్టుప్రక్కల ఇళ్ల వారు విషయాన్ని గుర్తించలేకపోయారు.

ఇదిలా ఉండగా, బాల య్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళ న చెందిన కృష్ణవేణి, ధర్మయ్య ఆత్మహత్య చేసుకున్నారా.. లేక వీరిద్దరిని హత్య చేశాక బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నా రు. వజ్రమ్మ తన ఇంటికి తాళం వేసి వెళ్లి పోయిన విషయం తెలుసుకుని వెనుక తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, కృష్ణవేణి మృతితో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఇక ధర్మయ్య భార్య కూడా భర్త వివాహేతర సంబంధం తెలియడంతో పదిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.

మరిన్ని వార్తలు