కారులో ఎక్కడికి వెళ్లారు..? 

22 Aug, 2022 11:18 IST|Sakshi

మొయినాబాద్‌(రంగారెడ్డి జిల్లా): మొయినాబాద్‌ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌ పాత గేటు వద్ద హైదరాబాద్‌– బీజాపూర్‌ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు తేల్చారు. మొయినాబాద్‌ నుంచి అప్పా వైపు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపునుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కిందికి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓయువతి, యువకుడు అక్కడికక్కడే మరణించారు. వీరిని ఎన్‌.కల్యాణి(22), టి.రాజేశ్‌కుమార్‌(36)గా పోలీసులు గుర్తించారు.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ములుగుంపల్లికి చెందిన కల్యాణి.. నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటూ పంజాగుట్టలోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రాజేశ్‌కుమార్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాజేశ్‌ జూమ్‌ కార్‌లో కారు అద్దెకు తీసుకున్నాడు. ఇద్దరు కలిసి చేవెళ్ల వైపు వెళ్లి తిరుగు ప్రయాణంలో అజీజ్‌నగర్‌ పాత గేటు వద్ద ప్రమాదానికి గురయ్యారు. శనివారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

కారులో ఎక్కడికి వెళ్లారు..? 
మృతి చెందిన కల్యాణి, రాజేశ్‌ కారులో ఎక్కడికి వెళ్లారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మూడు నెలల క్రితమే కల్యాణి నగరానికి వచ్చింది. ఎస్‌ఆర్‌ నగర్‌లోనే ఉంటున్న వీరిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం ఉంది..? కారు అద్దెకు తీసుకున్న చేవెళ్ల వైపు వెళ్లారా.. వికారాబాద్‌ వరకు వెళ్లారా..? అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమరాలను పరిశీలిస్తే వాహనం ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ పోలీసులు ఈ విషయాలపై తాత్సారం చేస్తున్నారు. రాజేశ్‌కుమార్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో గోప్యత ప్రదర్శించడం అనుమాలను రేకెత్తిస్తోంది.

మరిన్ని వార్తలు