మహిళ దురాగతం : పిండిలో విషం కలిపి..

30 Jul, 2020 10:35 IST|Sakshi

జడ్జితో పాటు కుమారుడి మృతి

భోపాల్‌ : చపాతీల్లో విషం కలిపి జిల్లా జడ్జి, ఆయన కుమారుడి మరణానికి కారణమైన ఓ మహిళ సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జడ్జి మహేంద్ర త్రిపాఠి, ఆయన కుమారుడు విషం కలిపిన చపాతీలు తినడంతో మరణించారని వెల్లడైంది. న్యాయమూర్తి త్రిపాఠికి గతంలో చింద్వారాలో పనిచేసిన సమయంలో అక్కడ ఎన్జీవోను నిర్వహించే మహిళ సంధ్యా సింగ్‌ (45)తో పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే న్యాయమూర్తి కుటుంబం బెతుల్‌లో ఆయనతో కలిసి నివసిస్తుండటంతో నాలుగునెలలుగా సంధ్యా సింగ్‌ త్రిపాఠీని కలుసుకోలేకపోయారు.

దీంతో త్రిపాఠీ కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలనే కసితో ఆమె రగిలిపోయింది. న్యాయమూర్తి కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా పూజ చేస్తానని ఈనెల 20న త్రిపాఠీని నమ్మబలికిన నిందితురాలు పూజ చేసేందుకు గోధుమ పిండిని తీసుకురావాలని కోరింది. ఆ తర్వాత గోధుమ పిండిని ఆయనకు ఇవ్వగా మహిళ ఇచ్చిన గోధుమపిండితో చేసిన చపాతీలను తిన్న న్యాయమూర్తి త్రిపాఠి, ఆయన కుమారుడు అస్వస్థతకు లోనయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా ఈనెల 25న తండ్రీ, కుమారులు మరణించారు. చపాతీలను తిన్న రెండో కుమారుడు సైతం అస్వస్ధతకు గురై చికిత్స పొందుతున్నారు. త్రిపాఠి భార్య ఆ రోజు చపాతీలు తినకుండా రైస్‌ తీసుకోవడంతో బతికిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు సంధ్యా సింగ్‌ ఆమె డ్రైవర్‌ సంజూ, ఆమెకు సహకరించిన దేవీలాల్‌ చంద్రవంశి, ముబిన్‌ ఖాన్‌, కమల్‌లను అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న తాంత్రిక్‌ బాబా రామ్‌దయాళ్‌ కోసం గాలిస్తున్నారు. చదవండి : ప్రాణం పోయాక వెలుగుచూసిన దారుణం

మరిన్ని వార్తలు