సీఐ మనిషినంటూ ఇద్దరి యువకుల హల్‌చల్‌

27 Apr, 2021 12:46 IST|Sakshi
ఓ సీఐతో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎస్సై చందర్‌ సింగ్‌

సాక్షి, హిమాయత్‌నగర్‌: నేను సీఐ మనిషినంటూ సినీ ఫక్కీలో ఎస్సైకి ధమ్కీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇద్దరు యువకులు. సోమవారం రాత్రి హిమాయత్‌నగర్‌ లిబర్టీ సర్కిల్‌ పరిధిలో విధుల్లో ఉన్న నారాయణగూడ పోలీసులు మాస్క్‌ లేకుండా బైకుపై వెళ్తున్న ఇద్దరి యువకుల్ని ఆపారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై చందర్‌సింగ్‌ వద్దకు ఆ యువకులు వచ్చి వాగ్వాదంకు దిగారు. ఏమైంది అని ఎస్సై చందర్‌ సింగ్‌ అడిగేలోపే ‘నన్నే ఆపుతారా.. నేను ఎవరో తెలుసా.. నేను మాస్క్‌ తీయలేదు.. నువ్వు మాట్లాడుతుంటేనే నీకు ఫోన్‌ వస్తది చూడు’ అంటూ ఎస్సైకి ధమ్కీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

పైగా ఆ ఇద్దరూ ఊగుతూ మాట్లాడుతున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో చెక్‌ చేసేలోపే ఆ యువకులకు సీఐ ఫోన్‌ చేశాడు. ఫోన్‌ అక్కడున్న ఎస్సైకి ఇవ్వు అనడంతో వాళ్లు ఎస్‌ఐకి ఫోన్‌ ఇచ్చారు. జరిగిన విషయం సీఐకి చెప్పేందుకు ఎస్సై చందర్‌ సింగ్‌ ప్రయత్నం చేస్తుండగా అదేమీ వినకుండా ‘మా వాళ్లని వదిలేయ్‌.. ఏమన్నా ఉంటే మీ సీఐతో మాట్లాడతా..’ అని అనడంతో చేసేదేమీ లేక దౌర్జన్యానికి పాల్పడ్డ ఆ ఇద్దరినీ వదిలేశారు.
చదవండి: ఛిద్రమైన కుటుంబం.. భర్త మృతితో ఆవేదన చెంది

మరిన్ని వార్తలు