యశవంతపుర(బెంగళూరు): దావణగెరె జిల్లా హరిహర తాలూకా హరగనహళ్లి వద్ద డ్యాం అందాలను వీడియో తీస్తూ నీటమునిగి స్నేహితులిద్దరూ మునిగి ఒకరు మరణించగా, మరొకరు గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... హరిహర ఆశ్రయ లేఔట్కు చెందిన పవన్ (25), ప్రకాశ్ (24) మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి అప్పుడప్పుడు వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్ స్టాలో పోస్ట్ చేసేవారు.
గురువారం సాయంత్రం వెళ్లి..
గురువారం సాయంత్రం సమీపంలోని జలాశయం నిండడంతో బైక్ వేసుకుని వెళ్లి వీడియో తీయసాగారు. అదుపుతప్పి నీటిలో పడిన ప్రకాశ్ను రక్షించడానికి యత్నించిన పవన్ కూడా మునిగిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరి జాడ లేకపోవడంతో బంధుమిత్రులు డ్యాం వద్ద బైక్ ఉండడంతో రోదిస్తూ గాలించసాగారు. శనివారం ఉదయం హరిహర రాఘవేంద్రమఠం వద్ద ప్రకాశ్ మృతదేహాన్ని కనుగొన్నారు. పవన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరి జతలో అదే గ్రామానికి చెందిన హనుమంత కూడా వెళ్లాడు. ఇద్దరు మునిగిపోయిన విషయాన్ని భయపడి ఎవరికీ చెప్పలేదు. శవం బయట పడిన తరువాత పోలీసులు విచారించగా రీల్స్ తీస్తుండగా ఘటన జరిగిందని హనుమంత వివరించాడు.