సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల కిందట మంచాల కస్తూర్బాగాంధీ గిరిజిన బాలికల హాస్టల్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మంచాల ఎస్సై రామన్ గౌడ్ కథనం ప్రకారం.. నగరంలో భిక్షాటన చేసే ఆరుగురు బాలికలను చైల్డ్లైన్వారు ఆపరేషన్ స్మైల్ ద్వారా చేరదీసి నగరంలోని చంద్రాయన్గుట్టలోని ఎంవీ ఫౌండేషన్లో చేర్పించారు. అక్కడ నుంచి రెండు నెలల కిందట మంచాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల హాస్టల్లో చేర్పించారు.
వారిలో సమ్రీన్(14) 9వ తరగతి, నుస్రత్(13) 8వ తరగతి చదువుతోంది. వీరు ఇరువురు బాలికలు శనివారం ఉదయం హాస్టల్ నుంచి పారిపోయారు. గమనించిన హాస్టల్ వార్డెన్ శ్రీలతారెడ్డి ఎంవీ ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం మంచాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: First Gay Marriage In Telangana: తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్