రైల్వేలో ఉద్యోగాలు, రెండు కోట్లకు టోకరా

12 Aug, 2021 08:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రూ.1.93 కోట్లు మోసం 

తిరువళ్లూరులో ఇద్దరు అరెస్టు

తిరువళ్లూరు(తమిళనాడు): రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 40 మందిని మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను తిరువళ్లూరు క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలుకా బొమ్మరాజుపేటకి చెందిన సత్యరాజ్‌(29). ఇతనికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 2.50 లక్షల రూపాయలను చిత్తూరు జిల్లా నగరి తాలుకా మేలప్పేడు గ్రామానికి చెందిన చిత్రయ్య కుమారుడు నాగరత్నం(53), అరక్కోణంకు చెందిన బాలాజీ (27) నగదు వసూలు చేశారు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని సత్యరాజ్‌ కోరాడు. అయినా వారు పట్టించు కోలేదు. దీంతో బాధితుడు తిరువళ్లూరు ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు నాగరత్నం, బాలాజీని అరెస్టు చేశారు. విచారణలో సుమారు 40 మందికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.1.93 కోట్లు మోసం చేసినట్లు తేలింది. దీంతో వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకునే వారిపట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

మరిన్ని వార్తలు