అనుమానాస్పద స్థితిలో చిన్నారుల మృతి

11 Nov, 2020 08:52 IST|Sakshi
చిన్నారుల మృతదేహం

నీటి గుంతలో తేలిన ఇద్దరి మృతదేహాలు

తెలకపల్లి (నాగర్‌కర్నూల్‌): అనుమానాస్పద స్థితిలో సంపు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మండలంలోని గడ్డంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్‌ సీఐ గాంధీ నాయక్, తెలకపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. గడ్డంపల్లికి చెందిన తలుపునూరు తిరుమలయ్య, భాగ్యలక్ష్మీ దంపతులకు కిట్టు(5) అమ్ములు (3) ఇద్దరు సంతానం. మంగళవారం సాయంత్రం తిరుమలయ్య అన్న అగు లక్ష్మయ్య ఇంటి ఎదుట ఉన్న సంపు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు. ఇద్దరు చిన్నారులు ఒకే దగ్గర మృతిచెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదిలాఉండగా, చిన్నారుల మృతదేహాలను నాగర్‌కర్నూల్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయని ఎస్‌ఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు