ప్రాణాలు తీసిన అత్యాశ.. గుప్త నిధుల కోసం గుంత తవ్వుతుండగా

30 Mar, 2021 14:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌: మాంత్రికుడి మాటలు నమ్మి గుప్తనిధుల కోసం ఇద్దరు బలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  తూత్తుకుడి జిల్లా, నజరేత్‌ తిరువళ్లువర్‌ కాలనీకి చెందిన ముత్తయ్య (65). ప్రైవేటు సంస్థలో వాచ్‌మన్‌. అతడి కుమారులు శివమాలై (40), శివవేలన్‌ (37). శివమాలై రియల్టర్‌. హిందూ మున్నని ముఖ్య నేత. శివవేలన్‌ సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ముత్తయ్య ఇంటి వెనుక గుప్తనిధులు ఉన్నట్లు తెలిపి ఆయన కుమారులు ఇద్దరు తన స్నేహితులైన ఆళ్వార్‌ తిరునగరికి చెందిన రఘుపతి (47), పన్నంపారైకు చెందిన నిర్మల్‌గణపతి (18) సాయంతో గుంత తవ్వడం మొదలుపెట్టారు.

ఆదివారం కూడా గుంత తవ్వుతుండగా  ఊపిరాడక స్పృహ తప్పారు. విషయం తెలిసి నజరేత్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలం చేరుకున్నారు. వెంటనే నలుగురినీ నెల్‌లై ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే నిర్మల్‌గణపతి, రఘుపతి మృతిచెందారు. ప్రాణాపాయస్థితిలో శివమాలై, శివవేలన్‌ చికిత్స పొందుతున్నారు. నెల్‌లై పోలీసుల విచారణలో కేరళకు చెందిన ఒక మాంత్రికుని రఘుపతి సంప్రదించగా అతను  శివమాలై ఇంటి వెనుక గుప్తనిధులు ఉన్నట్లు తెలిపినట్లు గుర్తించారు. దీంతో వారంతా అక్కడ గుంత తవ్వడం ప్రారంభించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు తెలిసింది. 
చదవండి: బస్సు టైరు పేలడంతో ఘోర ప్రమాదం

మరిన్ని వార్తలు