ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం 

14 Jan, 2021 10:41 IST|Sakshi

సాక్షి, కాచిగూడ: వివాహేతర సంబంధం బయటపడటంతో ఓ మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్స్‌పెక్టర్‌ హబీ బుల్లాఖాన్‌ వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన దుర్గయ్య కుమారుడు హన్మంతు (23) కాచిగూడలోని చెప్పల్‌ బజార్‌లో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. అదే ప్రాంతంలో మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన భర్తతో కలిసి ఓ వివాహిత (23) ఉంటున్నారు. హన్మంతుతో ఆమెకు కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. ఈ నెల 11న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు సాయంత్రం ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. మంగళవారం తన భార్య కనిపించడం లేదని కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. చదవండి: తుపాకీతో బెదిరించి.. కాళ్లు, చేతులు కట్టి!

సదరు మహిళ చెప్పల్‌బజార్‌లోని ప్రియుడు హన్మంతు ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో హన్మంతు ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మహిళ నిద్రమాత్రలు మింగి విగతజీవిగా మారింది. మంగళవారం రాత్రి స్థానికులు కాచిగూడ పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అనే కోణంలో  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్‌ ఎస్‌ఐ లక్ష్మయ్య పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు