ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురు హత్య 

22 Aug, 2020 06:40 IST|Sakshi

గోనె సంచుల్లో కట్టిన స్థితిలో బావిలో తేలిన మృతదేహాలు

పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన హిజ్రాలు

సాక్షి, చెన్నై: తిరునెల్వేలిలో ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురు హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. తిరునెల్వేలి సమీపంలోని సూత్తమల్లిలో హిజ్రాల నివాస ప్రాంతం ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్న హిజ్రాలు భవాని, అనుష్క ఆమె భర్త మురుగన్‌ గురువారం నుంచి కనిపించలేదు. వారి కోసం సహ హిజ్రాలు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీ కానరాలేదు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ స్థితిలో శుక్రవారం ఈ సంఘటన గురించి పోలీసులు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.

వారు ఇచ్చిన సమాచారం మేరకు పాళయంకోట ఫోర్‌ వే రోడ్డు సమీపంలో ఉన్న బావిలో తేలుతున్న గోనె సంచుల్లో కట్టిన స్థితిలో ముగ్గురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనిపించకుండా పోయిన హిజ్రాలు మృతదేహాలుగా కనిపించిన స్థితిలో సహ హిజ్రాలు పెద్ద సంఖ్యలో సూత్తమల్లి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి, హంతకులను పట్టుకోవాల్సిందిగా ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. 

>
మరిన్ని వార్తలు