Hyderabad: ఇల్లు శుభ్రం చేస్తుండగా బాల్కీనీలో నుంచి కింద పడిన మహిళ

11 Aug, 2022 09:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనుమానాస్పద స్థితిలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొంపల్లి బొబ్బిలి ఎంపైర్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రీనితా రెడ్డి(33) బుధవారం అదే ఆపార్ట్‌మెంట్‌ 5వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆరోగ్య కారణాల రీత్యా గత కొన్ని రోజులుగా మానసికంగా కృంగిపోయిన రీనిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 
చదవండి: ఉప్పల్‌: ల్యాబ్‌ సెంటర్‌లో డ్రగ్స్‌ తయారీ!.. ఇద్దరు అరెస్ట్‌

గచ్చిబౌలి: భవనంపై నుంచి పడి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ  సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్‌ తెలిపిన మేరకు.. నీలంపేట గ్రామం, చీడికాడ మండలం, వైజాగ్‌కు చెందిన బోను సత్యవతి(42) నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో నివాసం ఉంటోంది. సాయి సిగ్నేచర్‌ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ నెంబర్‌ 305లో పది రోజుల క్రితమే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అద్దెకు తీసుకున్నారు.

వారి వద్ద సత్యవతి హౌస్‌మేడ్‌గా పని చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఫ్లాట్‌ నెంబర్‌ 305లో శుభ్రం చేస్తుండగా బాల్కానీలోని వాష్‌ ఏరియా నుంచి కింద పడింది. దీంతో ఆమె తల, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. వెంటనే కాంటినెంటల్‌ హస్పిటల్‌కు తరలించగా అప్పటికే సత్యవతి మృతి చెందినట్లు  అక్కడి డాక్టర్లు దృవీకరించారు. ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాద వశాత్తు జారి పడిందా అనే విషయం విచారణలో తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. భర్త బోను ఈశ్వర్‌ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు