అర్థరాత్రి ప్రమాదం! బతుకులను చీకట్లో కలిపేసిన కాళరాత్రి

3 May, 2022 11:57 IST|Sakshi

అర్ధరాత్రి.. చిమ్మ చీకటి.. దానికి తోడు గాలీవాన.. రోడ్డు పక్కన బోల్తా పడిన ట్రాక్టర్‌. దాని కింద ఇద్దరు యువకులు.. అంత రాత్రి పూట ఎవరూ వారిని చూడలేదు. ప్రకృతి సాయం చేసే వీలూ ఇవ్వలేదు. తెల్లారే సరికి వారిద్దరి బతుకులు తెల్లారిపోయాయి. ఒక్క ప్రమాదం వీరి ద్దరి ప్రయాణాలకు శాశ్వతంగా ముగింపు పలికింది. ఒక్క కాళరాత్రి వీరి బతుకులను చీకటిలో కలిపేసింది. లఖిదాసుపురం గ్రామానికి చెందిన బొంగి వంశీకృష్ణ(23), గున్న అజయ్‌కుమార్‌(19)లు ఆదివారం రాత్రి ప్రతాపవిశ్వనాథపురం రెవెన్యూ పరిధిలో జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు.    

నందిగాం: లఖిదాసుపురానికి చెందిన బొంగి అశోక్‌కుమార్, వనిత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు వంశీకృష్ణ ట్రాక్టర్, లగేజీ వ్యా న్‌ నడుపుతూ కుటుంబానికి అండగా ఉంటున్నా డు. అలాగే ఇదే గ్రామానికి చెందిన గున్న సీతా రాం, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో అజయ్‌కుమార్‌ చిన్నవాడు. ఇంటర్‌ సెకండియర్‌ చదువుతూ చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. వంశీకృష్ణ వాళ్ల ట్రాక్టర్‌తో సిమెంట్‌ లోడ్‌ను వజ్రపుకొత్తూరు మండలం పూండీ తీసుకువెళ్లేందుకు అజయ్‌కుమార్‌ను ఆదివారం రాత్రి తోడు తీసుకెళ్లాడు.

పూండీలో లోడ్‌ దించేసి మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా ప్రతాపవిశ్వనాథపురం పరిధి మూలపొలం వద్ద ట్రాక్టర్‌ అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న పొలంలో బోల్తా పడింది. ట్రాక్టర్‌ నడుపుతున్న వంశీకృష్ణ, అజయ్‌కుమార్‌ ఇద్దరూ బండి కింద పడిపోయారు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన చిన్న వర్షం వల్ల ఆ మార్గాన వెళ్లే వారు ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు. ట్రాక్టర్‌ తీసు కెళ్లిన వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో వంశీకృష్ణ తండ్రి అశోక్‌కుమార్, అజయ్‌కుమార్‌ తండ్రి సీతారాంలు కుమారులకు కాల్‌ చేశారు.

కానీ ఎవరూ రిసీవ్‌ చేసుకోకపోవడం, ఒకరి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉండడంతో అనుమానం వచ్చి కణితూరు వరకు వెళ్లి చూశా రు. ఎక్కడా జాడ లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేశారు. సోమవారం ఉదయం ఆ మార్గాన వెళ్లే వారు ట్రాక్టర్‌ ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ ప్రమాద సమాచారం అందుకుని మృతదేహాలను ట్రాక్టర్‌ కింద నుంచి తీయడానికి క్రేన్‌ తెప్పించారు. అజయ్‌కుమార్‌ తండ్రి సీతారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నందిగాం ఎస్‌ఐ మహమ్మద్‌ యాసిన్‌ తెలిపారు.    

(చదవండి:  పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..)

మరిన్ని వార్తలు