బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల దుర్మరణం

28 Dec, 2020 08:17 IST|Sakshi

వ్యతిరేక దిశలో రోడ్డుపైకి వచ్చిన జేసీబీ వాహనం 

మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బైక్‌  

ఉప్పల్‌ మోడ్రన్‌ బేకరీ చౌరస్తాలో ఢీ  

సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్‌: రహదారి పక్కగా ఆగి ఉన్న జేసీబీ వాహనం రాంగ్‌ రూట్‌లో రోడ్డుపైకి వచి్చంది.. వ్యతిరేక దిశలోనే రోడ్డుకు ఎడమ వైపుగా వెళ్లి యూ టర్న్‌ తీసుకోవడానికి డ్రైవర్‌ ప్రయతి్నంచాడు. అదే సమయంలో ఆ రూట్‌లో మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన ద్విచక్ర వాహనం జేసీబీని ఢీకొంది.. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఉప్పల్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పారిశ్రామికవాడ మోడ్రన్‌ బేకరీ చౌరస్తాలో ఆదివారం సాయంత్రం జరిగింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు.. యాదాద్రి– భువనగిరి జిల్లా ఆకుతోట బావి తండా సురెపల్లిరికి చెందిన లకావత్‌ నరేష్‌ (22) ఘట్‌కేసర్‌ సమీపంలోని జోడిమెట్లలో ఉన్న ఇండూస్‌వివ కంపెనీలో పని చేస్తున్నాడు. తన సహోద్యోగి అయిన ఘట్‌కేసర్‌ ప్రాంతానికి చెందిన టంగుటూరి శ్రీరాములు కుమారుడు టంగుటూరి గణేష్‌తో (20) కలిసి ఆదివారం బయటకు వచ్చాడు. వీరిద్దరూ నరేష్‌కు చెందిన కేటీఎం డ్యూక్‌ స్పోర్ట్స్‌ బైక్‌పై రామంతాపూర్‌లో ఉన్న డీ మార్టు మాల్‌కు వచ్చారు. కాసేపు అందులోనే గడిపిన వీరు కొన్ని టీ షర్టులు ఖరీదు చేసుకున్నారు. సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి తిరిగు ప్రయాణమయ్యారు.  

♦ వీరి వాహనం రామంతాపూర్‌ వైపు నుంచి ఉప్పల్‌ వైపు అతివేగంతో వస్తోంది. ఈ మార్గంలోని మోడ్రన్‌ బేకరీ చౌరస్తా వద్ద రోడ్డుకు ఎడమ వైపున.. బేకరీకి ఎదురుగా జేసీబీ వాహనం పార్క్‌ చేసి ఉంది. ఆ వాహనాన్ని దాని డ్రైవర్‌ రోడ్డు ఇవతల.. బేకరీ వైపు ఉన్న పారిశ్రామిక వాడలోకి తీసుకువెళ్లాలని భావించాడు. సవ్యదిశ అయిన ఉప్పల్‌ రూట్‌లో కాస్త ముందుకు వెళ్లి డీఎస్‌ఎల్‌ మాల్‌ వద్ద యూ టర్న్‌ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఆ 600 మీటర్ల దూరాన్ని తప్పించుకోవడానికి జేసీబీ డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌ను ఆశ్రయించాడు.  

♦ మోడ్రన్‌ బేకరీకి ఎదురుగా ఆగి ఉన్న∙తన వాహనాన్ని అపసవ్య దిశలో ముందుకు తీసుకువచ్చి యూ టర్న్‌ తీసుకుని బేకరీ పక్కగా ఉన్న రూట్‌ ద్వారా పారిశ్రామిక వాడలోకి వెళ్ళడానికి ప్రయతి్నంచాడు. సాయంత్రం సమయం కావడంతో ఆ మార్గంలో వాహనాల రద్దీ తక్కువగా ఉంది. దీంతో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులూ మితిమీరిన వేగంతో రామాంతపూర్‌ వైపు నుంచి ఉప్పల్‌ వైపు దూసుకువస్తున్నారు.  రోడ్డు మధ్యలోకి వచ్చిన ఈ జేసీబీ వాహనాన్ని యువకులు హఠాత్తుగా గమనించారు. వేగాన్ని నియంత్రించుకునే ఆస్కారం కూడా లేకపోవడంతో అదే స్పీడ్‌లో జేసీబీ మధ్య భాగాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రభావానికి ద్విచక్ర వాహనం ముందు భాగం జేసీబీ కిందికి దూసుకుపోయింది.  

♦ వాహనాన్ని డ్రైవింగ్‌ చేస్తున్న నరేష్‌ తల బలంగా జేసీబీకి తగిలింది. దీంతో హెల్మెట్‌ పగిలిపోయి పక్కకు పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే చనిపోయాడు. ఇతడి మృతదేహం కాళ్లు ద్విచక్ర వాహనంపైనే ఉండగా.. తలకిందులుగా రోడ్డుపై వేలాడింది. బైక్‌ వెనుక కూర్చున్న గణేష్‌ గాల్లోకి ఎగిరి తలకిందులుగా రోడ్డుపై పడటంతో తలకు తీవ్రగాయమై ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలాడు.  

♦ నరేష్‌‌ తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో అతడి తల్లి బదిలి భువనగిరిలో చాయ్‌ బండి నడిపిస్తూ ముగ్గురు కుమారుల ఆలనాపాలనా చూసుకుంటోంది. నరేష్‌ ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరగా.. మిగిలిన ఇద్దరూ విద్యనభ్యసిస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని సైతం నరేష్‌కు అతడి తల్లే కొనిచ్చింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఉప్పల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు