విషాదం: అల్లుడి మృతి.. ఆగిన మామ గుండె 

11 Jul, 2022 08:01 IST|Sakshi
మృతి చెందిన వడ్డే రాజు, వడ్డే అంజినప్ప (ఫైల్‌)

కృష్ణగిరి(కర్నూలు జిల్లా): కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న అల్లుడు మృతి చెందిన వార్త వినగానే మామ గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన మండల కేంద్రమైన కృష్ణగిరిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామానికి చెందిన వడ్డే రాజు (40)కు కృష్ణగిరి చెందిన వడ్డే అంజినప్ప కుమార్తె అనసూయతో 20 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లయిన కొద్ది రోజులకే కృష్ణగిరి చేరుకుని అక్కడే పనులు చేసుకుంటూ స్థిరపడ్డారు.
చదవండి: వారిద్దరి పరిచయం, ప్రేమగా మారింది.. యువతికి ఐదో నెల అని తెలియడంతో..

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు కోలుకోలేక శనివారం రాత్రి ఇంటి వద్దనే మృతి చెందాడు. పక్క వీధిలో నివాసముంటున్న రాజు మామ వడ్డే అంజినప్ప ఈ విషయం తెలుసుకున్న వెంటనే గుండెపోటుతో ప్రాణం విడిచాడు. గంట వ్యవధిలో మామ, అల్లుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులిద్దరూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కావడంతో విషయం తెలుసుకున్న ఎంపీపీ డాక్టర్‌ కంగాటి వెంకటరామిరెడ్డి ఆదివారం గ్రామానికి చెందిన మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట నాయకులు జయరామిరెడ్డి, జింకల చిన్నన్న, అంకాలి సుంకన్న, ఎరుకలి బాల మద్దిలేటి, వడ్డే సత్యం తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు