సాక్షి, మహబూబ్నగర్: పట్టణంలో దారణం చోటుచేసుకుంది. భగీరథ కాలనీ సమీపంలో నరహరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగుటు నరహరిని గొంతుకోసి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి నరహరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. అయినా అతడు మృతిచెందక పోవడంతో.. కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అయితే నరహరి స్నేహితుడికి 80 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చినట్లు కుటుంబికుల నుంచి సమాచారం.
దీంతో ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య మహబూబ్నగర్ పట్టణంలో సంచలనంగా మారింది. మృతుడి భార్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే కావడం గమనార్హం. కాగా మృతుడి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి పరామర్శించారు.