దాహంగా ఉందని నీళ్లివ్వమన్నాడు! ఏమైందో తెలియదు యాసిడ్‌తో దాడి చేసి..

8 Jan, 2022 07:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాడుగుల(గురజాలరూరల్‌): దాహంగా ఉంది మంచినీరివ్వమ్మా... అంటూ అడిగిన వ్యక్తికి..దాహం తీర్చేందుకు నీరుతెస్తున్న మహిళపై ఆదే వ్యక్తి యాసిడ్‌తోదాడి చేసిన సంఘటన మండలంలోని మాడుగుల గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..మాడగుల గ్రామంలో ఆకుల భూలక్ష్మి వ్యవసాయకూలీ. నాలుగేళ్ల కిందట ఆమె భర్త వెంకటేశ్వర్లు పురుగుమందు తాగి మృతి చెందారు. అప్పటి నుంచి తనకున్న ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రులైన గోనుగుంట్ల వీరయ్య, ధనలక్ష్మీలతో కలిసి ఉంటుంది.  గురువారం రాత్రి 9గంటలకు గుర్తు తెలియని వ్యక్తి మంచినీరు ఇవ్వమ్మా దాహంగా ఉంది అని అడుగగా... పిల్లలతో కలిసి నిద్రిస్తున్న భూలక్ష్మీ నీరుతెచ్చి ఇస్తున్న సమయంలో యాసిడ్‌దాడి చేసి పరారయ్యాడు. యాసిడ్‌ దాడిలో ఆమెకు కుడి చెంప, గూడ, పక్కటెముకల వద్ద శరీరం కాలిపోయింది. గమనించిన తల్లిదండ్రులు గ్రామస్తుల  సహాయంతో గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఏఎస్‌ఐ స్టాలిన్‌ కేసు నమోదు చేయగా సీఐ ధర్మేంద్రబాబు దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరో ఘటనలో.. మంటల్లో కాలి మృతి చెందిన వ్యక్తి 
మంగళగిరి: కొప్పురావుకాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మంటలలో కాలి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొప్పురావుకాలనీలో పల్లిశెట్టి సాంబశివరావు తన నివాసంలో ఒక్కడే నివాసముంటున్నాడు. రోజూ లాగే బెడ్‌రూమ్‌లో పడుకుని నిద్రపోతుండగా తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో బెడ్‌రూమ్‌లో మంటలు చెలరేగి మంచానికి అంటుకున్నాయి. సాంబశివరావు మంటలలో చిక్కుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని ఆసుపత్రికి సాంబశివరావు కుమారుడుకి సమాచారమిచ్చినట్లు తెలిపారు.   

చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు

మరిన్ని వార్తలు