ఉన్నావ్‌ దారుణం: సంచలన విషయాలు వెల్లడి

20 Feb, 2021 11:06 IST|Sakshi
పోలీసులు అదుపులో నిందితుడు వినయ్‌

ప్రేమను నిరాకరించిందనే కోపంతో దారుణం

మైనర్‌ బాలికల హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దురాగతాలకు అంతు లేకుండా పోతుంది. తాజాగా కొద్ది రోజుల క్రితం ఉన్నావ్‌లో ముగ్గురు మైనర్‌, దళిత బాలికలపై విషప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ బాలిక కాన్పూర్‌ ఆస్ప్రతిలో చికిత్స పొందుతుది. ఈ దారుణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రధాన నిందితుడు వినయ్‌ అలియాస్‌ లంబుని అదుపులోకి తీసుకున్నారు. తానే ముగ్గురు మైనర్‌ బాలికలకు విషం ఇచ్చినట్లు అంగీకరించాడు. 

ఈ సందర్భంగా పోలీసు అధికారి లక్ష్మి సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణం వెనక ప్రధాన కారణం ప్రేమను అంగీకరించకపోవడం. నిందితుడు వినయ్‌, ఈ ముగ్గురు బాలికలకు లాక్‌డౌన్‌ కాలంలో పరిచయం ఏర్పడింది. వీరంతా పశువుల మేపడం కోసం పొలానికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు.. కబుర్లు చెప్పుకునే వారు. ఈ క్రమంలో వినయ్‌ ముగ్గురు బాలికల్లో ఒకరిని ప్రేమించాడు. అనేకసార్లు ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. కానీ సదరు బాలిక అంగీకరంచలేదు. కోపం పెంచుకున్న వినయ్‌ ఎలాగైనా బాలికను అంతం చేయాలనుకున్నాడు’’ అని తెలిపారు.

పథకం ప్రకారమే హత్య
‘‘ఈ క్రమంలో వినయ్‌ తన స్నేహితులతో కలిసి సదరు బాలికను చంపేందుకు ప్రణాళిక రచించాడు. దానిలో భాగంగా తన ఇంటిలో ఉన్న పురుగుల మందును తీసుకెళ్లి నీళ్ల బాటిల్‌ కలిపాడు. ఆ తర్వాత తినుబండారాలు, పురుగుల మందు కలిపిన వాటర్‌ బాటిల్‌ తీసుకుని బాధిత మైనర్‌ బాలికల దగ్గరకు వెళ్లాడు’’ అని తెలిపారు. 

‘‘రోజులానే నిందితుడు వినయ్‌, మిగతా బాలికలు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వినయ్‌ తన దగ్గర ఉన్న పురుగుల మందు కలిపిన వాటర్‌ బాటిల్‌లోని నీటిని తను ప్రేమించిన అమ్మాయి చేత తాగించాలని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది ముగ్గురు అమ్మాయిలు ఆ నీటిని తాగారు.  కాసేపటికే బాధితులంతా స్పృహ తప్పి పడిపోయారు.  ఊహించని ఈ ఘటనకు భయపడిని వినయ్‌, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు అని తెలిపారు.

పట్టించిన కాల్‌ డీటెయిల్‌ రికార్డు
దారుణం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. అక్కడ వారికి సిగరేట్‌ పీక, వాటర్‌ బాటిల్‌ కనిపించింది. ఆ తర్వాత మిగతా వారిని ప్రశ్నించగా.. వినయ్‌ పాత్ర బయటకు వచ్చింది. దాంతో పోలీసులు కాల్‌ డీటెయిల్‌ రికార్డ్‌(సీడీఆర్‌) టెక్నిక్‌ ద్వారా వినయ్‌ ఈ దారుణం జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను చేసిన దారుణం గురించి వెల్లడించాడు. 

ఇక తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఉరి తీయాల్సిందిగా బాధిత బాలికల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. జరిగిన దారుణం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. మహిళల భద్రత విషయంలో యూపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యింది అంటూ మండి పడుతున్నాయి. 

చదవండి:
దారుణం: ఉలిక్కి పడిన ‘ఉన్నావ్’‌‌
వాళ్లను పెళ్లికి పిలవొద్దు.. పిలిచారనుకో..

మరిన్ని వార్తలు