‘ఇంట్లో రాక్షసులు: చంపి గుండెని కోసి కూర వండాడు’

25 Feb, 2021 09:03 IST|Sakshi

అమెరికాలో వెలుగు చూసిన పైశాచిక చర్య

వాషింగ్టన్‌: కొన్ని రకాల నేరాలు.. వాటికి పాల్పడిన వ్యక్తుల్ని చూస్తే.. మనుషుల్లో ఇంత రాక్షసత్వం దాగి ఉంటుందా.. ఇంత క్రూరంగా.. దారుణంగా ఓ మనిషిని చంపగలరా అనే అనుమానం, భయం కలుగుతాయి. వారిని తిట్టడానికి.. వారి చేష్ట గురించి వివరించడానికి ఏ భాష సరిపోదు. తాజాగా ఇలాంటి భయానక ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అత్యంత పాశవీకంగా ఒకరిని చంపి.. గుండెని పెకిలించి.. దాన్ని కూర వండిన పైశాచిక చర్య వెలుగు చూసింది. నేరస్తుడు చెప్పిన విషయాలు విన్న పోలీసులకే వెన్నులో ఒణుకు వచ్చింది. ఓక్లహోమా‌లో చోటు చేసుకున్న ఈ భయానక దారుణం వివరాలు..

లారెన్స్‌ పౌల్‌ ఆండర్సన్‌ వ్యక్తి డ్రగ్స్‌ కేసులో దాదాపు 20 ఏళ్ల పాటు జైలులో గడిపి కొన్ని వారాల కిందటే విడుదలయ్యాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంటి పక్క వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత మరణించిన వ్యక్తి గుండెని బయటకు తీసి.. దాన్ని తన అంకుల్‌ వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ గుండెని కోసి.. ఆలుగడ్డలతో కలిపి కూర వండాడు. ఆ తర్వాత అంకుల్‌ కుటుంబ సభ్యుల చేత దాన్ని తినిపించాలని భావించాడు. 

ఇతడి వికృత చేష్టలు చూసిన పౌల్ అంకుల్‌, అతడి కుటుంబ సభ్యులు‌ భయపడి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పౌల్‌ అతడి అంకుల్‌ని, వారి నాలుగేళ్ల కుమార్తెని చంపేశాడు. అంకుల్‌ భార్యని చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ఎలానో తప్పించుకుని.. బయటపడగలిగింది. స్థానికులు ఆమెని ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఓక్లహోమా పోలీసులు పౌల్‌ని అరెస్ట్‌ చేశారు. విచారణలో అతడు విస్తుపోయే అంశాలు వెల్లడించాడు.

తన అంకుల్‌ ఇంట్లో రాక్షసులు ఉన్నారని.. వారిని తరమడం కోసం.. గుండెని వండి వారితో తినిపించాలని భావించాను అన్నాడు. కానీ వారు అంగీకరించకపోవడంతో చంపేయాల్సి వచ్చిందని తెలిపాడు. లేదంటే ఆ రాక్షసులు అంకుల్‌ కుటుంబాన్ని పీడించి.. వారిని ఆవహించి.. జనాలను చంపేసేవారు అన్నాడు పౌల్‌. 

చదవండి: 
కిడ్నాప్‌ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు
టిక్‌టాక్‌లో.. కాస్ట్‌లీ మిస్టేక్‌!

మరిన్ని వార్తలు