చుట్టూ పదుల కొద్ది జనాలు.. రైలులో మహిళపై అత్యాచారం

19 Oct, 2021 10:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలో చోటు చేసుకున్న దారుణం

వాషింగ్టన్‌: ఆడవారి మీద అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అగ్రరాజ్యం హోదాను మోస్తున్న అమెరికాలో కూడా ఈ దారుణాలు నిత్యకృత్యంగా మారాయి. అయితే నిర్మానుష్య ప్రాంతంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటే.. సాయం చేయలేకపోవచ్చు.. కానీ చుట్టూ జనాలు ఉన్నప్పటికి కూడా మృగాడి బారి నుంచి మహిళను కాపాడలేకపోవడం నిజంగా సిగ్గు చేటు. కళ్ల ముందే దారుణం జరుగుతుంటే.. చుట్టూ ఉన్న వారు చేష్టలుడిగి చూస్తూంటే.. తనపై జరిగిన అత్యాచారం కన్నా.. జనాల నిస్సహాయత బాధితురాలిని అధికంగా బాధిస్తుంది.

ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మృగాడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో రైలులో పదుల కొద్ది జనాలు ఉన్నారు.. కానీ ఒక్కరు కూడా దారుణాన్ని ఆపలేకపోయారు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్‌ చేయలేదు. ఆ వివరాలు..
(చదవండి: మీరొస్తే కూత.. మేమొస్తే కోత: కబడ్డీ ఆడిన భారత్‌-అమెరికా సైనికులు

కొన్ని రోజుల క్రితం బాధితురాలు 69 వ వీధి రవాణా కేంద్రం వైపు మార్కెట్-ఫ్రాంక్‌ఫోర్డ్ లైన్‌ మీదుగా రైలు ప్రయాణం చేస్తుంది. అదే ట్రైన్‌లో నిందితుడు ఫిస్టన్‌ ఎన్‌గోయ్‌ కూడా ఉన్నాడు. బాధితురాలి పక్కనే కూర్చుని ఉన్నాడు. రాత్రి పద గంటల ప్రాంతంలో ఈ ప్రయాణం చోటు చేసుకుంది. బాధితురాలి పక్కన కూర్చున్న ఫిస్టన్‌ పలుమార్లు ఆమెను అసభ్యకరంగా తాకాడు. ఆమె ప్రతిఘటించినప్పటికి అతడి తీరు మార్చుకోలేదు. ఆ సయమంలో ట్రైన్‌లో బాధితురాలితో పటు కొద్ది మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. 

రైలులో ఉన్న ప్రయాణికులు ఫిస్టన్‌ అనుచిత చర్యలను చూస్తూ ఉన్నారు కానీ.. ఎవరు ముందుకు వచ్చి అతడిని వారించే ప్రయత్నం చేయలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన ఫిస్టన్‌ ప్రయాణికులందరూ చూస్తుండగానే.. వారి ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను కాపాడాల్సిందిగా ఎంత ప్రాధేయపడినా.. ఎవరు ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకు రైల్వే ఉద్యోగులు కూడా ఆమెకు సాయం చేయలేదు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్‌ చేయలేదు. ఆ తర్వాత రైలులోకి వచ్చిన ఓ వ్యక్తి జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు కాల్‌ చేశాడు. 
(చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్‌.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు)

ప్రస్తుతం పోలీసులు ఫిస్టన్‌ని అరెస్ట్‌ చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘రైలులో ఈ దారుణం జరుగుతున్న సమయంలో అక్కడ డజన్ల కొద్ది ప్రయాణికులు ఉన్నారు. వారు కాస్త ధైర్యం చేసి ముకుమ్మడిగా ముందుకు వచ్చి ఉంటే నిందితుడు భయపడేవాడు.. బాధితురాలికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఈ సంఘటన పట్ల మనందరం సిగ్గుపడాలి. ఒక్కడిని చూసి ఇంతమంది భయపడటం చాలా అవమానకరం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

చదవండి: రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళపై సామూహిక లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని..

మరిన్ని వార్తలు