Lucknow: విమానం టైరును ఎత్తుకెళ్లిన దుండగులు!

4 Dec, 2021 19:59 IST|Sakshi

లక్నో: కాస్త ఏమరుపాటుగా ఉంటే దొంగలు తమచేతి వాటం చూపిస్తారు. సాధారణంగా నగానట్రో, రోడ్డుపై ఉన్న వాహనాలనో మూడోకంటికి తెలీకుండా పనికానిచ్చేస్తారు. ఐతే ఓ దొంగల ముఠా ఏ కంగా విమానం టైర్‌ను ఎత్తుకెళ్లింది! లక్నోలోని బక్షి-కా-తలాబ్ ఎయిర్‌బేస్ నుండి జోధ్‌పూర్ వైమానిక స్థావరానికి సైనిక వస్తువులను తీసుకెళ్తున్న ట్రక్కులో మిరాజ్ ఫైటర్ జెట్ విమానం టైర్‌ను గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. నవంబర్‌ 27 అర్ధరాత్రి లక్నోలోని షాహీద్ పాత్‌లో జోధ్‌పూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్తున్న సమయంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకెళ్తే..

షాహీద్‌ పాత్‌ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో స్కార్పియో వాహనంలో వెళ్తున్న దుండగులు టైరుకు కట్టేందుకు ఉపయోగించే పట్టీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. లారీ డ్రైవర్‌ పోలీసులకు విషయం తెలియజేసే సమయానికి దొంగలు పరారయ్యారు. అతను పోలీసులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా షాహీద్‌ మార్గంలో జామ్‌ కావడంతో ట్రక్కు నెమ్మదిగా కదులుతున్న సమయంలో దొంగలు అర్ధరాత్రి 12 గంటల 30 నిముషాల నుంచి 1 గంటల మధ్య చోరీకి పాల్పడ్డారని ట్రక్‌ డ్రైవర్‌ హేమ్ సింగ్ రావత్ తెలిపారు.

బక్షి-కా-తలాబ్ వైమానిక స్థావరం నుండి సైనిక వస్తువుల సరుకును తీసుకువెళుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానానికి చెందిన ఐదు టైర్లు లక్నో ఎయిర్‌బేస్ నుండి అజ్మీర్‌కు ట్రక్కులో రవాణా అవుతున్నాయి. అందులో ఒక టైరును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నవంబర్ 27న చోటుచేసుకోగా.. డిసెంబర్ 1న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ ఈస్ట్ అమిత్ కుమార్ తెలిపారు.

చదవండి: ఫేస్‌బుక్‌లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్‌!

మరిన్ని వార్తలు