మణుగూరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

30 Jun, 2021 12:53 IST|Sakshi

సాక్షి,  వాజేడు(వరంగల్‌) : భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరు(రామానుజ పురం) వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరుకు చెందిన డర్రా నర్సింహరావు (35), యర్రావుల లక్ష్మయ్య (40) మృతి చెందారు. ఇదే ఘటనలో వాజేడుకు చెందిన డ్రైవర్‌ మొడెం కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కొత్త ఇంటి ఇటుక కోసం..
పేరూరుకు చెందిన డర్రా నర్సింహరావు కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్నాడు. ఈ మేరకు ఇటుకలను తీసుకురావడానికి మండల పరిధిలోని చెరుకూరుకు చెందిన వ్యాను కిరాయికి మాట్లాడుకుని తీసుకువెళ్లారు. ఈక్రమంలో మొడెం కృష్ణ వ్యాను నడుపుతుండగా, మణుగూరులోని రామానుజపురం వద్ద బొగ్గు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. దీంతో డ్రైవర్‌ కృష్ణ, డర్రా నర్సింహరావు(35), యర్రావుల లక్ష్మయ్య(40) క్యాబిన్‌లోనే ఇరుక్కు పోయారు.

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్సై నరేష్‌ ఆధ్వర్యాన గంటకు పైగా శ్రమించి వ్యాను క్యాబిన్లో ఇరుకున్న ముగ్గురిని బయటకు తీసి భద్రాచలం ఏరియా వైద్య శాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డర్రా నర్సింహరావు, యర్రావుల లక్ష్మయ్య మృతి చెందారు. మొడెం కృష్ణ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉన్నట్లు తెలిసింది. కాగా, మృతి చెందిన నర్సింహరావుకు భార్యా ఇద్దరు పిల్లలు ఉండగా, లక్ష్మయ్యకు భార్య ఉంది.  

చదవండి: ఏడాది క్రితం లవర్ మృతి.. ప్రస్తుతం ఆమె కడుపులో అతని బిడ్డ

మరిన్ని వార్తలు