భర్త హత్య.. అతడి సాయంతోనే పూడ్చిపెట్టింది!

12 Mar, 2021 08:26 IST|Sakshi

హత్య కేసులో నిందితుల రిమాండ్‌ 

హస్తినాపురం: ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తను హత్య చేసి  పూడ్చి పెట్టిన కేసులో నిందితురాలైన అతడి భార్య నౌసీన్‌బేగంను వనస్థలిపురం పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఆమెకు సహకరించిన మరో నిందితుడు సునీల్‌ తివారీ కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అతడిని పురానాపూల్‌ ప్రాంతంలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌ మురళీమోహన్‌ తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నౌసిన్‌ బేగం అలియాస్‌ మరియాద అగర్వాల్‌ (32), గగన్‌ అగర్వాల్‌ (38) భార్యాభర్తలు. నౌసిన్‌కు గతంలోనే పెళ్లయి నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్తతో గొడవలు కావడంతో విడాకులు ఇచ్చి వేరుగా ఉంటున్న ఆమెకు గగన్‌ పరిచయమయ్యాడు.

ఈ క్రమంలో అప్పటికే భార్యతో విడాకులు తీసుకున్న అతడు, నౌసిన్‌ను ప్రేమించి గతేడాది ఏడాది జూన్‌లో మతాంతర వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి వివేకానందనగర్‌ కాలనీలోని గగన్‌ అగర్వాల్‌ సొంతింటిలో కాపురం పెట్టారు. ఎనిమిది నెలలుగా బాగానే సాగిన వీరి కాపురంలో, ఆ తర్వాత కలతలు చెలరేగాయి. ఈ క్రమంలో గత నెల 8న గగన్, నౌసిన్‌ మధ్య తీవ్ర ఘర్షణ జరగగా, నౌసిన్‌ ఆగ్రహంతో కత్తి తీసుకొచ్చి గగన్‌ గొంతులో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇంట్లోనే కుళాయి కోసం తీసిన గుంతలో గగన్‌ మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు నౌసిన్‌ అంగీకరించింది.

చదవండిదారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య
విషాదం.. నవ దంపతుల దుర్మరణం

మరిన్ని వార్తలు