హత్యకు 5 లక్షల సుపారీ

6 May, 2022 02:44 IST|Sakshi
సుపారీ గ్యాంగ్‌ కుట్రను వివరిస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే   

వివాహేతర సంబంధమే కారణం  

కుట్రను ఛేదించిన పోలీసులు  

వేములవాడలో నలుగురి అరెస్ట్‌  

సిరిసిల్ల క్రైం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హత్య చేసేందుకు రూ.ఐదు లక్షల డీల్‌ కుదుర్చుకున్న సు పారీ గ్యాంగ్‌ కుట్రను ఛేదించినట్టు సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే తెలిపారు. ఈ ఘాతుకానికి ప్రణాళిక చేసిన ముగ్గురితోపాటు హత్య చేయడానికి ఒప్పుకున్న బిహారీని అరెస్టు చేసినట్టు చెప్పా రు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. వేములవాడలోని తిప్పపూర్‌కు చెందిన నీలం శ్రీనివాస్‌ కుమార్తెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్తకు తెలియకుండా వేములవాడకు చెందిన మనోజ్‌కుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

పద్ధతి మార్చుకోవాలంటూ మనోజ్‌కు పెద్దల సమక్షం లో పలుమార్లు పంచాయితీలు పెట్టారు. కానీ ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. శ్రీనివాస్‌ తన పరిచయస్తులకు ఈ విషయాన్ని చెప్పాడు. మనోజ్‌ హత్యకు శ్రీనివాస్‌.. తిప్పపూర్‌లో ఉండేæ మానుకు కుంటయ్య, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బొమ్మాడి రాజ్‌కుమార్, బిహార్‌కు చెందిన లిఖింద్ర సాహ్నితో రూ.5 లక్షలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మనోజ్‌ రోజు కూలి కోసం వేములవాడ బైపాస్‌ నుంచి వస్తాడని గ్రహించిన వీరు గురువారం ఉదయం బైపాస్‌లోని బతుకమ్మతెప్పవద్ద మరణాయుధాలతో కారులో మాటువేశారు.

ఇదే సమయంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి అక్కడున్న కారును తనిఖీ చేశారు. అందులో 2 పెద్దకత్తులున్నాయి. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, మనోజ్‌ను హత్య చేయడానికి చేసిన కుట్రను శ్రీనివాస్, కుంటయ్య, రాజ్‌కుమార్, సాహ్ని వెల్లడించారు. పోలీసులు వీరి నుంచి కారు, బైక్, 4 సెల్‌ఫోన్లు, చంపాలనుకున్న వ్యక్తి ఫొటో, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు