షాకింగ్‌ వీడియో.. బైక్‌ను వెంబడించి మరీ.. యువకుడిని కత్తితో పొడిచి..

2 Jan, 2023 17:27 IST|Sakshi

భోపాల్‌: ఆరుగురు మైనర్లు ఓ బైక్‌ను వెంబండించి మరీ కాలేజీ విద్యార్థిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. రోడ్డుపై జరిగిన చిన్న వాగ్వాదం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డిసెంబర్‌ 31న చోటుచేసుకుంది. భన్వర్‌ కౌన్‌ ప్రాంతంలో ఆయుష్‌(22) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతున్నాడు.

రద్దీగా ఉన్న రోడ్డుపై కొంత మంది అబ్బాయిలు నిలబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో హారన్‌ కొట్టిన ఆయుష్‌..దారి క్లియర్‌ చేసి వాహనాలను వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిందిగా వారిని కోరాడు. ఈ క్రమంలో మైనర్లకు, యువకుడికి మధ్య గొడవకు దారితీసింది. అనంతరం కొంతమంది మైనర్లు బైక్‌ వెనక పరుగెత్తి బైక్‌పై వెనకాల కూర్చున్న ఆయుష్‌పై కత్తితో దాడి చేశారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

రద్దీగా ఉన్న రోడ్డుపై కొంతమంది యువకుల బృందం బైక్‌ వెనకాల పరుగెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరికి బైక్‌ వెనకాల కూర్చున్న వ్యక్తిని పట్టుకొని కత్తితో పొడిచారు. అనంతరం వారందరూ అక్కడి నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈ ఘటన అనంతరం ఆయుష్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాధితుడు మరణించారు. నిందితులైన ఆరుగురు మైనర్లను పోలీసులు అరెస్ల్‌ చేశారు. అందరిపై హత్యా కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు