కానిస్టేబుల్‌ ఇంట్లో విజిలెన్స్‌ దాడి.. ఆస్తులు చూసి నోరెళ్లబెట్టారు

30 Nov, 2021 13:35 IST|Sakshi

బరంపురం(భువనేశ్వర్‌): అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న ఆరోపణల నేపథ్యంలో కానిస్టేబుల్‌ సురేంద్ర ప్రధాన్‌ ఇళ్లల్లో విజిలెన్స్‌ అధికారులు సోమవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 3 వేర్వేరు ప్రాంతాల్లోని కానిస్టేబుల్‌ ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేపట్టిన అధికారులు దాదాపు రూ.2.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. పలు విలువైన దస్త్రాలు, బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు, చెక్‌బుక్‌లు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాం జిల్లా, బంజనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సురేంద్ర ప్రధాన్‌ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, అవన్నీ అక్రమంగా సంపాదించినవేనన్న సమాచారం మేరకు కటక్‌ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తమై, దాడులు చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం జరిగిన అధికారుల దాడుల్లో కానిస్టేబుల్‌కి బరంపురంలోని లుచ్చాపడలో 3 అంతస్తుల భవనం, నిమ్మఖండి గ్రామంలో మరో 3 అంతస్తుల భవనం, గురింటి గ్రామంలో రెండంతస్తుల భవనం ఉన్నట్లు నిర్ధారించారు. కానిస్టేబుల్‌ బంధువుల ఇళ్లల్లో సైతం అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కానిస్టేబుల్‌ని అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నట్లు విజిలెన్స్‌ ఎస్పీ త్రిలోచన్‌ స్వంయి తెలిపారు.

చదవండి: Parag Agrawal : అడిషనల్‌ పేపర్‌ కోసం గొడవ.. శ్రేయా ఘోషల్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ కూడా!

మరిన్ని వార్తలు