ఏమి జరిగిందో తెలియదు.. ఆ పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి..

31 Jan, 2022 16:24 IST|Sakshi
విజయ్‌ కుమార్, మధుప్రియ (ఫైల్‌)  

సాక్షి, ఆలూరు (కర్నూలు): రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో ఇద్దరిని దూరంగా ఉంచారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఆలూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని స్థానిక గోవర్ధన్‌ టాకీస్‌ సమీపంలో నివాసం ఉంటున్న నాగేంద్ర, అనిత దంపతుల కుమారుడు విజయ్‌ కుమార్‌ (18), అదే కాలనీలో నివాసం ఉండే రమణ, అనిత దంపతుల కుమార్తె మధుప్రియ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విజయ్‌ కుమార్‌ ఇంటర్‌ పూర్తి చేసి ప్రస్తుతం ఆలూరు ఐటీఐ కళాశాలలో డీజల్‌ మెకానికల్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

మధుప్రియ ఆలూరులోని మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ వరకు చదివి పులివెందుల ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్‌ చదివే సమయంలో వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మధుప్రియను వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందుల కళాశాలలో బీటెక్‌ చేర్పించారు. అప్పుడప్పుడు సెల్‌ ఫోన్‌లో ఇద్దరూ మాట్లాడుకునే వారని తెలిసింది. అయితే వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని శుక్రవారం రాత్రి 7.30 గంటలకు విజయ్‌ కుమార్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చదవండి: (ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..) 

ఈ విషయం మధుప్రియకు తెలిసి అదే రోజు హాస్టల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు హాస్టల్‌ నిర్వాహకులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థినిని అనంతపురం జిల్లా కదిరిలో ఉంటున్న పెదనాన్న ఇంటికి తీసుకొచ్చారు. విజయ్‌ మరణాన్ని జీర్ణించుకోలేక మధుప్రియ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆదివారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. తమ పిల్లలు ఉన్నతంగా చదివి ప్రయోజకులవుతారని ఆశించిన పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి. ప్రేమికుల ఆత్మహత్యతో ఆలూరులో విషాదం అలుముకుంది.     

చదవండి: (భర్త పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో..)   

మరిన్ని వార్తలు