పది నిముషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా..

7 Feb, 2021 20:46 IST|Sakshi
గుండప్ప (ఫైల్‌)

విధులు ముగించుకొని ఇంటికి వెళ్తూ మృతి

మృత్యువు రూపంలో దూసుకొచ్చిన లారీ 

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు దుర్మరణం    

హెల్మెట్‌ ఉన్నా దక్కని ప్రాణం

తాండూరు రూరల్‌: మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మృత్యువు రూపంలో వచ్చిన లారీ బలిగొంది. ఇంటి వద్ద నిరీక్షిస్తున్న భార్యాపిల్లలు అతడి మృతి విషయం తెలుసుకొని గుండెలుపగిలేలా రోదించారు. ఈ విషాదకర సంఘటన తాండూరు మండలం కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో శనివారం జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. తాండూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన గుండప్ప(29) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మండలంలోని జినుగుర్తి తండాలో ఎస్‌జీటీగా పని చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఆయన విధులు ముగించుకొని బైక్‌పై తాండూరు వస్తున్నాడు.

ఈక్రమంలో కరన్‌నోట్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా తాండూరు నుంచి చించోళి వేస్తున్న లారీ గుండప్ప బైక్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఢీకొంది. గుండప్ప ధరించిన హెల్మెట్‌ ఎగిరిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండప్పకు భార్య మిల్కీ, కూతూరు నిస్సీ (5) ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే గుండప్ప మృతితో తాండూరు పట్టణ ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు