ఖాకీలపై గ్రామస్తుల దాడి 

14 Jan, 2021 16:24 IST|Sakshi
కోళ్ల పందేలు నిర్వహించిన ప్రదేశం

పలువురిని నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు

భువనేశ్వర్‌ : మల్కన్‌గిరి జిల్లాలోని కలిమెల సమితిలో ఉన్న మారగాన్‌ పల్లి గ్రామంలో పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఎస్‌డీపీ అభిలాష్‌ సహా మరో ఎనిమిది మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కలిమెల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్రామ శివారులోని ఓ తోట వద్ద కొంతమంది గ్రామస్తులు మద్యం తాగడం, కోళ్ల పందేలు నిర్వహించడం వంటివి చేస్తుండగా అక్కడికి మఫ్టీలో చేరుకున్న పోలీసులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో సివిల్‌ దుస్తుల్లో ఉన్న పోలీసులను ఎవరో కొత్త వారు అని భావించిన గ్రామస్తులు.. ‘మా ప్రాంతానికి వచ్చి, మాకే ఎదురు తిరుగుతారా?’ అని వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆఖరికి వారు పోలీసులని తెలియటంతో అక్కడినుంచి గ్రామస్తులు పరారయ్యారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు గ్రామస్తులను నిర్భందంలోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు