Viral Video: దురదృష్టకరమైన ఘటన... గాయపడిన పక్షిని రక్షించడమే శాపమైంది

11 Jun, 2022 18:13 IST|Sakshi

రోడ్డుప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ట్రాఫిక్‌ పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. నిర్లక్షపూరితమైన డ్రైవింగ్‌, పక్కవారికి ఏమైన అవుతుందనే భయం లేని స్పీడ్‌ డ్రైవింగ్‌ తదితరాలే ఈ ప్రమాదాలకు కారణం. కనీసం ముందున్న కారు ఎందుకు ఆగిందో అని కూడా లేకుండా తమదారి తమదే అన్నట్లుగా ఢీ కొట్టి వెళ్లిపోతున్నారు. కొంతమంది యాక్సిడెంట్‌ చేసి కేసు నుంచి తప్పించుకునేందుకు ఆగకుండా వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక ఒక ప్రబుద్ధుడు వేగంగా ట్యాక్సీ నడుపుతూ.. రోడ్డు పై ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టి వెళ్లిపోయాడు.

వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలపిన కథనం ప్రకారం...ముంబై నేపీన్‌సీ రోడ్‌లో వాసం ఉంటున్న వ్యాపారవేత్త అమర్ మనీష్ జరీవాలా తన డ్రైవర్‌ శ్యామ్ సుందర్ కామత్‌తో కలసి ముంబై బీచ్‌ హైవైపై మలాడ్‌ వైపుగా వెళ్తున్నారు. ఐతే ఇంతలో ఒక పక్షి వారి కారుని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాపారవేత్త, అతని డ్రైవర్‌ గాయపడిన పక్షిని రక్షించేందుకు కారులోంచి దిగారు.

ఇంతలో వేగంగా వస్తున్న ఒక ట్యాక్సీ వారిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాపరవేత్త అక్కడికక్కడే చనిపోయాడు, డ్రైవర్‌ కామత్‌ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ట్యాక్సీ డ్రైవర్‌ కుమార్ జైశ్వర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే ఈ ఘటన హైవే పై ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. 

(చదవండి: కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్‌ చేసి మరీ...)

మరిన్ని వార్తలు