Visakhapatnam: కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు

22 Jun, 2022 13:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కారు పార్కింగ్‌ విషయంలో గొడవ

పీఎం పాలెం (భీమిలి): ఏదైనా గొడవ జరిగితే సామాన్యులు వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తారు. అటువంటిది.. ఇద్దరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు గొడవ పడటమేగాక కొట్టుకున్నారు. ఇద్దరూ గాయపడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది. 

పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. జీవీఎంసీ ఆరో వార్డులోని పీఎంపాలెం ఆఖరు బస్టాప్‌ సమీపంలోగల షిప్‌యార్డు కాలనీలోని శ్రీనిలయం అపార్టుమెంట్‌లో ఏసీబీలో సీఐగా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్, వీఆర్‌లో ఉన్న సీఐ రాజులనాయుడు కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరిద్దరు సెల్లార్‌లోని కారు పార్కింగ్‌ విషయంలో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. 

ఈ క్రమంలో సోమవారం సీఐలతో పాటు వారి కుటుంబసభ్యుల మధ్య మరోమారు వివాదం తలెత్తింది. కొట్లాటకు దారితీసింది. సీఐలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. సీఐ ప్రేమ్‌కుమార్‌ 100కు డయల్‌ చేసి సమాచారం అందించడంతో పీఎం పాలెం పోలీసులు అక్కడకు వెళ్లి ఘర్షణపై వివరాలు సేకరించారు. మంగళవారం సీఐలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (క్లిక్‌: ఔను.. ఆయనకు ఉద్యోగం వచ్చింది)

మరిన్ని వార్తలు