మైనర్‌ను గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. బాబుకు జన్మనిచ్చిన బాలిక

26 Oct, 2021 14:26 IST|Sakshi

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

సాక్షి, విశాఖపట్నం: పదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలికకు ప్రైవేటు పాఠాలు చెబుతూ ఆమెను లోబరచుకుని గర్భవతిని చేసి.. పండంటి బిడ్డను కన్నాక ముఖం చాటేసిన ప్రబుద్ధుడి వైనమిది. బాధితురాలి కుటుంబీకులు, గ్రామపెద్దలు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాతవరం మండలం గుమ్మడిగొండ గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక నర్సీపట్నం మండలం వేములపూడి కస్తూర్బా స్కూలులో పదో తరగతి చదివేది. కరోనా కారణంగా గత ఏడాది సెలవుల్లో గుమ్మడిగొండలో ఇంటి వద్దే ఉంది. ఆ సమయంలో ఇంటి పక్కనే ఉన్న దగ్గర బంధువు బైలపూడి జెమీలు కుమారుడు బైలపూడి ఉపేంద్ర వద్దకు ప్రైవేటుకు వెళ్తుండేది.
చదవండి: సొంత చెల్లిని వ్యబిచారంలోకి దింపిన అక్క.. బాలికపై కన్నేసి!

ఉపేంద్ర గుంటూరులో రెండో ఏడాది బీటెక్‌ చదువుతున్నాడు. అతను  ఏడాది నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇద్దరి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు బయటకు వెళ్లిన సమయంలో అతను మాయ మాటలు చెప్పి బాలికను శారీరకంగా లొంగదీసుకున్నాడు. లోకజ్ఞానం అంతగా తెలియని తల్లిదండ్రులు ఆమె గర్భం దాల్చిన విషయం గమనించలేకపోయారు. ఈ నెల 24న కడుపునొప్పి ఎక్కువ కావడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు బయల్దేరారు. నర్సీపట్నం వచ్చేసరికి ఆమెకు మరింతగా నొప్పులు రావటంతో అక్కడి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి కడుపులో కాయ ఉందని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని స్కానింగ్‌ తీసేందుకు పంపించారు. స్కానింగ్‌ రిపోర్టు చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు.
చదవండి: జూబ్లీహిల్స్‌: కోట్ల విలువైన ఇంటిని అమ్ముతానని నమ్మించి.. చివరికి!

బాలిక నిండు గర్భంతో ఉందని వెంటనే ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడికి వెళ్లిన గంటలోనే బాలికకు సాధారణ డెలివరీ జరిగి బాబుకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు కుమార్తెను నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే ఉపేంద్రకు సమాచారం ఇవ్వగా అతను మొహం చాటేయడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సీపట్నం రూరల్‌ సీఐ కె.శ్రీనివాసరావు, నాతవరం ఎస్‌ఐ దుంపల శేఖరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తప్పును అంగీకరించకపోవడంతో పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్సీపట్నం ఏఎస్పీ విజయ మణికంఠ చందోల్‌ తెలిపారు. న్యాయం చేయాలని బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర మహిళా కమిషన్‌కు, నర్సీపట్నం ఆర్డీవో, కోటవురట్ల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేశారు.  

మరిన్ని వార్తలు