జుత్తాడ మర్డర్‌: పాత కక్షలతో దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు

15 Apr, 2021 18:06 IST|Sakshi

విశాఖ పట్నం: విశాఖ జిల్లా జుత్తాడ అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రశాంత పల్లె. రాజకీయ దురందులతో పాటు మంచి మనసులను సమాజానికి అందించిన పల్లె అలాంటి పల్లెలో రక్తం పారింది. ఓ సమస్య విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఓ వ్యక్తి కత్తి పట్టడంతో ఆరుగురు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. విశాఖ నగరానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో జుత్తాడ గ్రామం ఉంది. అన్ని కులాలకు చెందిన వ్యక్తులతో పాటు 500 వరకు ఇల్లు ఉన్న ఈ గ్రామంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.

కొత్త తరం యువత మాత్రం మార్బుల్ ఫ్లోరింగ్ పనులు చేస్తున్నారు. ఈ దశలో గ్రామంలో బమ్మిడి రమణ, బత్తిన అప్పలరాజు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రమణ కుమారుడు విజయ్ కిరణ్ మూడేళ్ల క్రితం ఒక విషయంలో అప్పలరాజు కుటుంబంతో వివాదం ఏర్పడింది. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం కేసు ట్రయుల్ లో వుంది. ఈ ఘటన నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో విజయ్ కిరణ్ ఉపాధి రీత్యా విజయవాడకి వెళ్లిపోయాడు. అతని భార్య ఉష ముగ్గురు పిల్లలతో అక్కడే జీవిస్తున్నాడు. తండ్రి మాత్రం విశాఖలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు.

ఈ దశలో అప్పలరాజు తన కుటుంబానికి అన్యాయం జరిగిందనే భావనలో ఉండేవాడు. అయితే, ఈ వివాదం తర్వాత రమణ కుటుంబం ఇతరులతో కొంత దూరంగా ఉంటూ వస్తోంది. ఈ దశలో రెండు రోజుల క్రితం రమణ దగ్గర బంధువుల వివాహానికి సంబంధించి పెళ్లి కార్డులు, కొత్త బట్టలు కొనుగోలు చేయాలని భావించారు. విజయ్ కిరణ్ భార్య, ముగ్గురు పిల్లలు, ఇద్దరు మేనత్తలు జుత్తాడ వచ్చారు. నిన్న రాత్రి నగరంలోని శివాజీ పార్క్ వద్ద ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నారు. మరి కొన్ని పెళ్లి కార్డులు విజయనగరంలో పంపిణీ చేయాలని వారు వచ్చారు.

అయితే విజయ్ కుమార్ పెద్ద కొడుకు మాత్రం బంధువులు వెంట ఉండిపోతానని మారాం చేయడంతో శివాజీని అక్కడే విడిచిపెట్టారు. ఈ దశలో తెలవారు జామున ఐదున్నర గంటల సమయంలో వాకిలి శుభ్రం చేసేందుకు రమణ సోదరి అరుణ బయటికి వచ్చింది. అదే అదనుగా భావించిన అప్పలనాయుడు ఒక్కసారిగా ఆమెపై విచక్షణ రహితంగా నరికేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బత్తిన రమణ, అతని కోడలు ఉషశ్రీ, చిన్నారులు ఉదయ్, మూడు నెలల పాపతో పాటు మరో మహిళను అత్యంత కిరాతకంగా చంపేశాడు.

అనంతరం ఆరుగురిని చంపేశానంటూ ఊర్లో కేకలు వేసుకుంటూ అప్పలరాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఎంత అమానుష ఘటన తమ గ్రామంలో ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా కేసులో నిందితుడు అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదుపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడంతో పాటు అతన్ని అరెస్టు చేశారు. గతంలో విజయ్ కిరణ్, అతని కుటుంబ సభ్యులపై కూడా కేసులు కొనసాగుతున్నాయి.

వివాదాలకు దూరంగా ఉండాలని విజయవాడకు మారిన ఆ కుటుంబంపై అప్పలనాయుడు కక్ష గట్టినట్టు తాజా పరిస్థితి బట్టి తెలుస్తోంది. పోలీసుల ఎదుట లొంగిపోయిన అప్పలనాయుడును పోలీసులు విచారిస్తున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతని మానసిక పరిస్థితిని కూడా ఆరా తీస్తున్నారు. అయితే, తన కుటుంబం వీధిన పడడానికి విజయ్ కిరణ్ కుటుంబమే కారణమన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అప్పలరాజు పోలీసులకు చెప్తున్నాడు. ఇతనే అభిప్రాయం ఎలా ఉన్నా మానవ సమాజం ఎటు వెళుతుందా అన్నట్టు తాజా సంఘటన జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: 

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్య

మరిన్ని వార్తలు