మహాబలిపురంలో విశాఖ యువకుడి మృతి  

3 Nov, 2021 09:14 IST|Sakshi

సాక్షి, పెదగంట్యాడ (గాజువాక):  గాంధీనగర్‌కు చెందిన ఓ విద్యార్థి చెన్నై సమీపంలోని మహాబలిపురం బీచ్‌లో మంగళవారం మృతి చెందాడు. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని గాంధీనగర్‌లో కాతా బాలకృష్ణ, వెంకటలక్ష్మి పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ ‘వర్షు’ ఆక్వా ప్రింట్స్‌ పేరిట  ప్రింటింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు కాతా వర్షు (18) చెన్నైలోని ఓ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదవుతున్నాడు. చెన్నై నుంచి స్నేహితులతో కలసి మహాబలిపురం బీచ్‌కు వెళ్లాడు.

అక్కడ బీచ్‌లో దిగిన తర్వాత కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు. గల్లంతైన వర్షు కోసం అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. మూడు రోజుల క్రితం చెన్నైకు దగ్గరుండి దించి వచ్చిన తల్లి వెంకట లక్ష్మి .. కుమారుడి మృతి వార్త విని కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు, బంధువుల మహాబలిపురానికి బయలుదేరి వెళ్లారు. మృతదేహాన్ని బుధవారం ఇక్కడకు తీసుకురానున్నారు.  

చదవండి: (సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్‌)

మరిన్ని వార్తలు