పొలంవైపు కుళ్లిన వాసన.. అక్కడికి వెళ్లి చూస్తే..

24 May, 2022 10:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,రాజాం సిటీ(విజయనగరం): మండల పరిధి పొగిరి గ్రామ పంటపొలాల్లో సోమవారం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతదేహాన్ని పరిశీలించి పాత్రుని అప్పలసూరి (25)గా గుర్తించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల  ప్రకారం పొందరవీధికి చెందిన అప్పలసూరి కర్నాటకలోని మిర్చియార్డులో పనిచేసి ఈ నెల 19న గ్రామానికి వచ్చాడు. 20తేదీ ఉదయం బయటకు వెళ్లిన కుమారుడు ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబసభ్యులు మిర్చియార్డు కాంట్రాక్టర్‌ను వాకబుచేశారు.

ఇక్కడికి రాలేదని కాంట్రాక్టర్‌ చెప్పడంతో ఆందోళన చెంది అన్ని చోట్లా వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో పొలంవైపు వెళ్లిన గ్రామస్తులకు కుళ్లిన వాసనరావడంతో పరిశీలించి మృతదేహంగా గుర్తించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు.   పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతి కేసు నమోదుచేశామని ఎస్సై  ఇ.శ్రీనివాస్‌ తెలిపారు.

చదవండి: డాడీ వెరీ బ్యాడ్‌.. నరకం చూపిస్తున్నాడు!

మరిన్ని వార్తలు