లోన్‌ యాప్‌ దారుణం: రూ.2 వేలకు లింక్‌ పంపి.. ఆపై మార్ఫింగ్‌ ఫొటోలు స్నేహితుడి భార్యకు పంపి..

26 Oct, 2022 01:45 IST|Sakshi
దాసరి శేఖర్‌ (ఫైల్‌)

వనపర్తి జిల్లా కొత్తకోటలో ఘటన  

కొత్తకోట రూరల్‌: ఆన్‌లైన్‌ లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. వనపర్తి జిల్లా కొత్తకోట విద్యానగర్‌కాలనీకి చెందిన దాసరి శేఖర్‌(32) కారుడ్రైవర్‌. నాలుగు నెలల క్రితం తన సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియనివ్యక్తి ఫోన్‌ చేసి లోన్‌ కావాలంటే లింక్‌ పంపిస్తాం.. డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పారు. దీంతో శేఖర్‌ గతనెల 18న రూ.2 వేలు తీసుకున్నాడు. తాను తీసుకున్న రూ.2 వేలతోపాటు అదనంగా రూ.200 వారంరోజుల్లోగా చెల్లించాడు.

శేఖర్‌కు డబ్బు అవసరం లేకున్నా యాప్‌ నిర్వాహకులు మరో రూ.2,500 జమచేశారు. మళ్లీ వారంలోగా ఆ డబ్బుకు కొంత మొత్తాన్ని జతచేసి తిరిగి చెల్లించా డు.  ఇంకా అదనంగా డబ్బులు చెల్లించాలని నిర్వాహకులు వేధించడం మొదలుపెట్టారు. మార్ఫింగ్‌ చేసిన శేఖర్‌ ఫొటోలను అతని స్నేహితుడి భార్యకు పంపారు.  దీంతో శేఖర్‌ రూ.30 వేలకుపైగా చెల్లించాడు.

అయినా వేధింపులు ఆగకపోవ డంతో అవమానానికి గురైన శేఖర్‌ ఆదివారంరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. శేఖర్‌కు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, అంతకుముందు సైబర్‌ నేరగాళ్ల నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పాలని శేఖర్‌ తన స్నేహితుడికి ఫోన్‌ చేసి మొరపెట్టుకున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

మరిన్ని వార్తలు