మమ్మి నన్ను వెతకకు.. బావిలో పడి చనిపోతున్నా..

29 Sep, 2021 07:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బావిలో పడి విద్యార్థి మృతి

సాక్షి,చిట్యాల(వరంగల్‌): ఇంట్లో సెల్‌ఫోన్‌తో ఆడుతుండగా సెల్‌ఫోన్‌ కిందపడి పగిలిపోవడంతో కూలి పనికి వెళ్లి వచ్చిన అమ్మ.. కొడుతుందనే భయంతో గాజె శ్రీరాం (14) అనే విద్యార్థి ఆదివారం ఇంట్లో నుంచి పారిపోయి బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్‌లో మంగళవారం చోటుచేసుకుంది.

స్థానిక ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపిన కథనం ప్రకారం.. చిట్యాల మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామ శివారు రాంచంద్రాపూర్‌కు చెందిన గాజె రాజేష్‌– విజయ దంపతులకు ఏకైక కుమారుడు శ్రీరాం ఉన్నాడు. కాగా, గతంలో విజయ భర్తతో దూరమై రెండేళ్ల క్రితం తన కుమారున్ని తీసుకుని జూకల్‌ గ్రామంలో ఉన్న తన తల్లి ఇంటి వద్దనే ఉంటుంది. శ్రీరాం జూకల్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో ఇంట్లోనే సెల్‌తో ఆడుతుండగా అది కాస్త కిందపడడంతో పగిలిపోయింది.

దీంతో అమ్మ వచ్చి కొడుతుందని భయపడి అదే సెల్‌లో శ్రీరాం వీడియో రికార్డు చేసి పెట్టాడు. తల్లి ఇంటికి వచ్చిన అనంతరం పగిలిన సెల్‌ను ఆన్‌ చేయగా అందులో మమ్మి నేను వెళ్లి పోతున్నాను. నన్ను వెతకకు రోడ్డు దగ్గర ఉన్న బావిలో పడి చనిపోతానని ఆ వీడియోలో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో అప్పటి నుంచి ఆ బావి వద్ద వెతికినా దొరకలేదు. మంగళవారం అదే బావిలో శవమై తేలాడు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.  

చదవండి: ప్రేమించిన యువతి చెల్లి అవుతుందని తెలిసి..

మరిన్ని వార్తలు