Warangal Premonmadi: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి..

22 Apr, 2022 13:37 IST|Sakshi
ఆస్పత్రి వద్ద రోదిస్తున్న బాధితురాలు అనూష తల్లి.. ఇన్‌సెట్లో చికిత్స పొందుతున్న అనూష

సాక్షి, వరంగల్‌: అతనికీ, ఆమెకు ఓ పెళ్లిలో పరిచయమైంది. తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో రగలిపోతున్న ఆ యువకుడు ఆ విద్యార్థిని ఇంట్లోనే ఆమె గొంతుకోసి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న ఆమెను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. హనుమకొండ జిల్లాలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.  

దూరంగా పెట్టిందని దారుణం  
వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన పోలంపల్లి రాములు, రేణుకల కుమార్తె (23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్‌ చదువుతోంది. రాములు కుటుంబం హనుమకొండ గాంధీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రాము లు వెల్డింగ్‌ షాపులో దినసరి కూలీగా పనిచేస్తుండగా, రేణుక ఇళ్లల్లో పనిచేస్తోంది. వారి కుమార్తె పోటీ పరీక్షల కోసం గత కొంతకాలంగా హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటోంది. ఆమె రెండేళ్ల క్రితం వరంగల్‌ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో జరిగిన తన మేనమామ కూతురు పెళ్లికి వెళ్లింది. అప్పుడు అక్కడే పక్కింటిలో ఉండే అజార్‌తో పరిచయం ఏర్పడింది.

ఒకరి ఫోన్‌ నంబర్‌ మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ సమయంలో అజార్‌ ఐటీఐ పూర్తిచేసి కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఫోన్‌ లో మాట్లాడుకుంటున్న క్రమంలో అజార్‌ ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె తనకు ఇష్టం లేదని చెప్పింది. ఆమెను ఒప్పించడానికి అజార్‌ చాలా ప్రయత్నించాడు. అయితే కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. కాగా శుక్రవారం ఉదయమే ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది.

అప్పటికే స్నేహితుల ద్వారా ఆమె హనుమకొండకు వస్తున్న విషయం తెలుసుకున్న అజార్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. చున్నీతో ముఖాన్ని చుట్టేసి ముందుగానే తనవెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయంతో అరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమెను స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. 

చదవండి👉🏾 ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. మార్ఫింగ్‌ చేసిన వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌ 

ప్రాణాపాయం తప్పింది.. 
ఆస్పత్రిలో ఆ విద్యార్థిని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. పెళ్లిలో పరిచ యం అయిన అజార్‌ ప్రేమించాలం టూ వేధించేవాడని, తను ఇంకో వ్యక్తి తో మాట్లాడుతున్నట్లు అసూయపడి కోపం పెంచుకుని దాడి చేశాడని ఆమె చెప్పినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపారు. అజార్‌ను అరెస్టు చేసి 307, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలికి ఆర్‌ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయస్థితి నుంచి బయట పడిందని ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌లు విద్యార్థినిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

తమిళిసై తీవ్ర విచారం
ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనపై గవర్నర్‌ తమిళిసై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.  మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
చదవండి👉🏾 మల్కాజ్‌గిరి మహిళ హత్యలో ట్విస్ట్..

మరిన్ని వార్తలు