పట్టపగలు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుబాయ్‌ దారుణం..

25 Apr, 2021 13:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే మహిళా సిబ్బందికి రక్షణ లేకుండాపోయింది. ఆసుపత్రిలో పనిచేసే ఓ యువతిపై కాంట్రాక్టు విధానంలో పనిచేసే వార్డుబాయ్‌ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆసుపత్రివర్గాలను  ఆందోళనకు గురిచేస్తుంది. గురువారం ఉదయం ఆసుపత్రిలో ఓ వార్డులో విధులు నిర్వహిస్తున్న యువతి అదే వార్డులో స్టాక్‌ ఉండే గదిలోకి వెళ్లగా వార్డుబాయ్‌ ఆమె వెనకాలే వచ్చి గది తలుపులు బిగించి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన ఆసుపత్రి అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

వార్డుబాయ్‌ని శుక్రవారం బాధితురాలి బంధువులు ఆసుపత్రిలోనే చితకబాదినట్టు తెలిసింది. ఉదయం షిప్టులోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఇక రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఇదేవార్డుబాయ్‌ పై పలు ఆరోపణలు ఉన్నా వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనక మతలబు ఏమిటన్నది ఆసుపత్రిలో చర్చజరుగుతోంది. ఇద్దరి మధ్య సయోధ్యకుదిర్చేయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మహిళా సిబ్బంది ప్రజలకు వైద్యాసేవలందిస్తుంటే ఇలాంటి వారితో ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతోందని , వార్డుబాయ్‌ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు