పెండ్లి రోజు పార్టీ.. నవ వరుడు హత్య 

10 Jan, 2022 10:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): విల్లియనూరులో ప్రజలకు ఇబ్బందికరంగా పెండ్లి రోజు పార్టీని జరుపుకుంటున్న వారిని ప్రశ్నించడంతో.. మద్యం మత్తులో ఉన్నవారు నవ వరుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. వివరాలు.. పుదుచ్చేరి రాష్ట్రం విలియనూరు మూర్తినగర్‌కు చెందిన సతీష్‌ అలియాస్‌ మణిగండన్‌ (28). ఇతను ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఇటీవల మదివదన (25)తో వివాహమైంది.

శనివారం రాత్రి అతను ఇంటికి ఎదురుగా ఉండే శంకర్‌ (32) అతని భార్య రమణి (28) వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వీధిలో కేక్‌ కట్‌ చేసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో రమణి తమ్ముడు రాజా, అతని స్నేహితుడైన తెన్నెల్‌ ప్రాంతానికి చెందిన అజార్‌ సామియర్‌ తోపుకు తమిళ్‌ సెల్వన్‌ మద్యం మత్తులో వీరంగం సృష్టించినట్లు తెలిసింది.

దీంతో వారిని స్థానికులు సతీష్, శబరి, హరి, రాజా ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో రాజా, శంకర్, అజార్, తమిళ్‌ సెల్వన్, సతీష్‌ను కత్తితో పొడిచి  హత్య చేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.   

మరిన్ని వార్తలు