జైలు ప్రాంగణమే పెళ్లి మండపం..

14 Aug, 2021 11:14 IST|Sakshi

భువనేశ్వర్‌/చౌద్వార్‌: జైలు ప్రాంగణం పెళ్లి మంత్రాలతో మారుమోగింది. అత్యాచార ఆరోపణపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. తనపై ఆరోపణలు చేసిన యువతిని వివాహం చేసుకున్నాడు. కటక్‌ చౌద్వార్‌ సర్కిల్‌ జైలులో శుక్రవారం ఈ పెళ్లి వేడుక జరిగింది. స్థానిక ఉద్ధార్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. కటక్‌ జిల్లా సాలేపూర్‌ గ్రామానికి చెందిన అంశుమాన్‌ మల్లిక్‌ నిశ్చింతకొయిలి గ్రామానికి చెందిన చిన్నయి సెఠిని వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు.

దీంతో ఆ యువతి మల్లిక్‌పై మోసం చేశాడంటూ కేసు పెట్టింది. అయితే ఇరువురి కుటుంబాలు పరస్పరం వారి పెళ్లికి అంగీకరించడంతో జైలు ఆవరణంలోనే జడ్జి అనుమతి మేరకు వివాహం చేసుకున్నారు. జైలు అధికారులు, వధూవరుల కుటుంబ సభ్యులు, కొద్ది సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా వివాహం జరిపించినట్లు జైలు వార్డెన్‌ సత్యప్రకాష్‌ స్వంయి, జైలరు బిభేందు భుంయ్యా, ఉద్ధార్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నరోత్తమ దాస్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు