‘మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌.. అమ్మా, నాన్నా క్షమించండి..’

26 Apr, 2022 20:23 IST|Sakshi

తణుకు(పశ్చిమ గోదావరి): పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాను... అమ్మా, నాన్నా నన్ను క్షమించండి... నేను చనిపోతున్నాను అంటూ నర్సింగ్‌ విద్యార్థిని సూసైడ్‌ నోట్‌ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం తణుకు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఆపిల్‌ ఆసుపత్రికి అనుబంధంగా కొనసాగుతున్న నర్సింగ్‌  కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న మాత్రపు షారోన్‌ కుమారి (21) సోమవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రి మూడో అంతస్తు హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.

చదవండి👉: బాలిక అదృశ్యం.. పాపం ఏమైందో? 

భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన షారోన్‌కుమారి మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యింది. మనస్తాపం చెందిన ఆమె ఇటీవల స్వగ్రామం వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. సోమవారం తోటి విద్యార్థులంతా తరగతులకు వెళ్లారు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆమె హాస్టల్‌ గదిలోనే ఉండిపోయింది.

మధ్యాహ్నం సమయంలో స్వీపర్‌ వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి యాజమాన్యానికి సమాచారం అందించారు. తణుకు సీఐ సీహెచ్‌  ఆంజనేయులు, ఎస్సై ఎం.వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులు, ఆసుపత్రి యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు  మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు