రాజస్తాన్‌లో దారుణం

20 Sep, 2020 15:53 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

ఉదయ్‌పూర్‌ : వితంతు మహిళతో పాటు ఆమె ప్రియుడిగా అనుమానిస్తూ ఓ యువకుడిని కరెంటు స్థంబానికి కట్టేసి మూడు గంటల పాటు దారుణంగా హింసించిన ఘటన రాజస్తాన్‌లో వెలుగుచూసింది. చిత్తోర్‌గఢ్‌ సమీపంలోని దుంగ్లా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇద్దరు బాధితుల దుస్తులు చించివేసిన నిందితులు వారిని తీవ్రంగా గాయపరిచారు. ఘటన సమాచారం వెల్లడైన అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బన్సీలాల్‌, సన్వ్రా, భగ్‌వాన్‌లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుంగ్లాలో 3 ఏళ్ల కుమారుడితో కలిసి బాధిత మహిళ నివసిస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఆమె ఇంటికి ఓ వ్యక్తి నిత్యావసరాలు అందించేందుకు రాగా, ఆ యువకుడితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించిన గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. మహిళ ఇంటి నుంచి ఆమెను, యువకుడిని బయటకు లాక్కునివచ్చిన గ్రామస్తులు కరెంటు స్థంబానికి వారిని కట్టేసి దారుణంగా హింసించారు. నిందితులు మహిళ దుస్తులను చించారు. ఇక వీరిని నిందితులు తీవ్రంగా హింసిస్తున్నా చుట్టూ చేరిన వంద మంది మౌనం దాల్చారు. కొందరు గ్రామస్తులు నిందితులను వారించినా వారు వినలేదని స్ధానికులు తెలిపారు. స్ధానికులు కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఎస్పీ ఆదేశాలతో దుంగ్లా ఎస్‌హెచ్‌ఓ కేసు నమోదు చేసి బాధితులను వైద్య పరీక్షలకు పంపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చదవండి : వివాహితపై సామూహిక అత్యాచారం

మరిన్ని వార్తలు