ప్రియుడి మోజు: నిద్రపోతున్న భర్తపై దిండుతో అదిమిపట్టి..

25 Aug, 2021 17:10 IST|Sakshi

సాక్షి,లేపాక్షి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఇందుకు బాలుడి సహకారం కూడా తీసుకుంది. నిద్రపోతున్న భర్తపై దిండుతో అదిమిపట్టి.. ఊపిరి తీసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం లేపాక్షి పోలీస్‌ స్టేషన్‌లో హిందూపురం రూరల్‌ సీఐ పి.హమీద్‌ఖాన్‌ మీడియాకు వెల్లడించారు. లేపాక్షి మండలం శిరివరం ఎస్సీ కాలనీకి చెందిన గంగాదేవి, ముంతప్ప గారి నారాయణప్ప(50) దంపతులు. వీరికి నలుగురు సంతానం. కొంత కాలంగా గంగాదేవి పరిగి మండలానికి చెందిన ఆదెప్పతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

భర్తకు ఇటీవల విషయం తెలిసింది. దంపతులిద్దరూ తరచూ గొడవపడేవారు. పద్ధతి మార్చుకోని గంగాదేవి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను కడతేర్చాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి మంచంపై నిద్రిస్తున్న నారాయణప్పను ప్రియుడితో పాటు మేనల్లుడైన బాలుడి సహకారమూ తీసుకుని తలదిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చంపేశారు. హతుడి తమ్ముడు గంగప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన భార్య, ప్రియుడిని అరెస్ట్‌ చేసి, బాలుడిని అదుపులోకి తీసుకుని మంగళవారం మెజి్రస్టేట్‌ ఎదుట హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ సద్గురుడు, సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: మనువాడమన్నందుకు.. మట్టుబెట్టాడు 

మరిన్ని వార్తలు