భార్యా భర్తల గొడవ.. బామ్మర్తి చేతిలో బావ హతం

27 Mar, 2021 09:28 IST|Sakshi

బావమరిది చేతిలో బావ హతం

తొర్రకుంటపాలెం(జగ్గయ్యపేట): బావమరిదితో జరిగిన ఘర్షణలో బావ మృతి చెందిన ఘటన గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన తాటి సురేష్‌ (40) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్యామలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటివల కొంత కాలం నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. పెద్దలు రాజీ చేశారు. ఈ క్రమంలో ఈ నెల 19న మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ జరగటంతో భార్య పుట్టింటికి వెళ్లింది. గురువారం రాత్రి 12 గంటల సమయంలో సురేష్‌ భార్య కోసం వెళ్లాడు.

ఆ సమయంలో భార్య ఇంటిలో లేకపోవటంతో భార్య సోదరుడు గుడిశ కిషోర్‌కు సురేష్‌కు మధ్య ఘర్షణ జరిగింది.  దీంతో కిషోర్‌ కత్తితో సురేష్‌పై దాడి చేశాడు. సురేష్‌ అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికులు అతడిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్‌ మరణించాడు. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి పరమేశ్వరరావు ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కిషోర్‌ పరారీలో ఉన్నాడు.
(చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్‌ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌)

మరిన్ని వార్తలు